Saturday, April 27, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎండ దంచికొట్టిన సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. అటు రాష్ట్రంలో రానున్న మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు చోట్ల వడగండ్ల వానలు పడే అవకాశాలు ఉన్నట్టు వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్,లోని మధ్య భాగాల నుండి విదర్భ ,తెలంగాణ ,ఇంటీరియర్ కర్ణాటక రాష్ట్రం మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్రమట్టానికి 0.9కి.మి ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు , మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 40కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

రాగల 24గంటల్లో కొమరంభీం ఆసీఫాబాద్, మంచిర్యాల , నిజామబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు , మెరుపులు , ఈదురు గాలులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు యెల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. జనగాం జిల్లా కొడకండ్లలో అత్యధికంగా 24.2మి.మి వర్షం కురిసింది. మిగిలిన ప్రాంతాల్లో గంగధరలో 22.6, యాదగిరిగుట్టలో 19.4, బోయిన్‌పల్లిలో 15.4, చందురులో 9.6, జాజిరెడ్డిగూడెంలో 8.6, తిరుమలగిరిలో 8, అశ్వాపురంలో 7.4, పాలకుర్తిలో 7.4, సిర్పూర్‌లో 7.4, దేవరుప్పల్‌లో 7.2, ఘన్‌పూర్‌లో 5.8, జాఫర్‌గడ్‌లో 3.2, నిడమనూరులో 2.8, మాల్యాల్‌లో 2.6 రఘునాధపల్లిలో 1మి.మి చొప్పున వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా తేలిక పాటి జల్లులు పడ్డాయి.

పెరిగిన ఉష్ణొగ్రతలు
మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణొగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. అదిలాబాద్‌లో అత్యధికంగా 39.8డిగ్రీలు రికార్డయింది. నిజామబాద్‌లో 39.1, మహబూబ్‌నగర్‌లో 39, మెదక్‌లో 38.4, రామగుండంలో 38, ఖమ్మంలో 37.6, నల్లగొండ, హనుమకొండలో 37, హైదరాబాద్‌లో 36.2డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News