Saturday, May 4, 2024

మానసిక గాయాలతో జీవచ్ఛవాలు

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం మానవ అక్రమ రవాణా ప్రతి ఒక్క దేశంలో విస్తృతంగా ప్రబలుతోంది. అక్రమ మానవ రవాణా అంతర్జాతీయ కోట్ల డాలర్ల వ్యాపారంగా మారింది. ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న క్రిమినల్ పరిశ్రమలలో అక్రమ రవాణా ఉంది. ప్రతి సంవత్సరం 99 బిలియన్ కోట్ల వ్యాపారం జరుగుతోంది. మాదక ద్రవ్యాల సరఫరాను ప్రపంచంలోని అతి పెద్ద అక్రమ వ్యాపారంగా పేర్కొంటారు. దాని తర్వాత స్థానం ఆయుధాల అక్రమ రవాణాది. కాగా మానవ అక్రమ రవాణా మూడో స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి ఈ సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అమెరికా అధ్యయనం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మానవ అక్రమ రవాణా ద్వారా ఏటా 10 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. మానవుల అక్రమ రవాణాను సంఘ వ్యతిరేక, అనైతిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఈ నేరాలు కొనసాగుతున్నాయి. దేశంలో, రాష్ట్రంలో మహిళల, బాలికల అక్రమ రవాణా నానాటికీ పెరుగుతోంది.

జాతీయ నేర గణాంకాల విభాగం రికార్డుల ఆధారంగా దేశంలోని ప్రధాన నగరాలలో సాగుతున్న వ్యభిచార కేంద్రాలకు తరలుతున్న మహిళలు, బాలికలో 30 శాతం రాష్ట్రానికి చెందిన వారే కావడాన్ని బట్టి పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వ్యభిచార వృత్తిలో 75 మిలియన్ల మంది మహిళలు, బాలికలు మగ్గుతున్నారు. అందులో 25% భారత దేశానికి చెందినవారే. వీరిలో అధిక శాతం మైనర్ బాలికలే ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. ఇందులో 28 నుంచి 30 శాతం మహిళలు, బాలికలను వ్యభిచార కేంద్రాలలోకి బలవంతంగా నేడుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి.

ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే 12, 14 సంవత్సరాల అమ్మాయిలకు ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వారిలో మెచ్యూరిటీ పెంచే వ్యభిచార గృహాల నిర్వాహకులపై దర్యాప్తు నామమాత్రంగానే మిగిలిపోవడం. ఉపాధి లేక వలస కూలీగా అరబ్ దేశాలకు వెళ్ళిన మహిళను మధ్యవర్తులు అక్కడి షేక్‌లకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. కేవలం యాభై వేల రూపాయాలకు హైదరాబాద్ పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్ షేక్‌కి అమ్మేసిన సంఘటన. నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠా ల చేతుల్లో బానిసలుగా మారిపోతున్నారు. సమాజాన్ని అర్థం చేసుకునే లోపు వారి జీవితాలు నలిగిపోతున్నాయి. వారి ఆనందాన్ని, ఆశలను, ఆశయాలను అక్రమ రవాణా వ్యాపారులు ఆదిలోనే అంతం చేస్తున్నారు.

ముక్కుపచ్చలారని పసి పిల్లలు, అమాయకమైన ఆడ పిల్లలు, ఆదరణ కోరుకునే ఒంటరి మహిళలు అకస్మాత్తుగా కనిపించకుండాపోతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం విపరీతంగా పెరిగిపోతూనే ఉంది. ప్రేమ, పెళ్ళిళ్ళ పేరుతో మోసపోయేవారు కొందరైతే, ఉపాధి పేరుతో వలస వెళ్లి ఆపదలో చిక్కుకునేవారు మరికొందరు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందిస్తున్నా యథేచ్ఛగా మానవ అక్రమ రవాణా సాగుతూనే ఉంది. మాయమైపోతున్న బాధితుల్ని సంతల్లో వస్తువుల్లా వేలం వేస్తూ అమ్మేస్తున్నారు అక్రమ రవాణా ముఠాలు. కొందరిని లైంగిక బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంకొందరిని అవయవాల మార్పిడికి ఉపయోగించుకొంటున్నారు. మరి కొందరిని వెట్టి చాకిరీకి నిర్బంధిస్తున్నారు. బాధితుల్లో శారీరకంగా, మానసికంగా అయిన గాయాలు చివరికి వారిని జీవచ్ఛవాలుగా మార్చేస్తున్నాయి. సమాజంపైనే విరక్తి, ఏహ్యభావం పెంచుకునేలా తయారవుతున్నారు.

అధిక మొత్తంలో డబ్బును సునాయాసంగా సంపాదించడానికి మానవ అక్రమ రవాణా వ్యాపారాన్ని ఎంచుకుంటున్నారు. త్వరగా డబ్బు సంపాదించాలన్న కోరిక, కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కపెట్టాలన్న బాధ్యత, ఇలా కారణాలేవైనా మంచి, చెడు లు ఆలోచించకుండా అడుగులేయడం వల్ల చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. సంపాదనకు సులువైన మార్గాల్ని ఎంచుకునే ప్రయత్నం చేయడం వల్లే ఎక్కువ మంది ఈ అక్రమ రవాణా బారిన పడుతున్నారు. మానవ అక్రమ రవాణా వ్యాపారులు సాంఘికంగా అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వయసులో ఉన్న బాలికలు, స్త్రీలు, చిన్న పిల్లలను భయ పెట్టడం, ప్రలోభ పెట్టడం, అబద్ధాలు మాట్లాడటం, మాయ మాటలు చెప్పి వారి బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఊబిలోకి దింపుతున్నారు.

మైనర్ బాలికలు ఏ పని చేయబోతున్నారో ముందుగా వారికి తెలియకుండానే బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించబడుతున్నారు. వ్యాపారులు ఎలా చెబితే అలా నడుచుకోవాల్సిందే. ఎదురు తిరిగే సాహసం చేస్తే చిత్ర హింసలకు గురవుతుంటారు. వారి శరీరం మీద వారికే స్వేచ్ఛ లేని పరిస్థితి. గాయాలు, దెబ్బలు, అవమానాలు, సమాజంపై నమ్మకం సడలటం చివరకు తమపై తామే నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొంటున్నాయి. చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల ఎక్కువ అబార్షన్‌లు జరుగుతూ ఉంటాయి.పొత్తి కడుపు నొప్పి, కడుపు నొప్పి, చర్మ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. బాధితురాలు వొంటిపై పుండ్లు, గాయాలు, మంటలతో తీవ్రమైన బాధలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అక్రమ రవాణాకు గురైన బాలలు సుఖవ్యాధులతో పాటుగా హెచ్‌ఐవి బారినపడే అవకాశాలు ఉన్నాయి. పసి పిల్లల అక్రమ రవాణా ఇప్పుడు అందరినీ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వీరిని భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత తలిదండ్రులదే. పిల్లలను బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా వదిలేయడం, అపరిచితులకు అప్పజెప్పడం, కుటుంబ గొడవలు, సమస్యల్ని ఇతరులతో పంచుకోవడం లాంటి వాటికి దూరంగా ఉండాలి.

హింసాత్మక నేరపూరిత ఆలోచనలతో, మానవత్వానికి వ్యతిరేకంగా సమాజంలో జరుగుతున్న మానవ అక్రమ రవాణాను ముందు జాగ్రత్త వహిస్తే అరికట్టవచ్చు. ట్రాఫికింగ్‌కు గురైన బాలికలను వ్యభిచార వృత్తిలో దించడం, ఇతర పద్ధతులలో లైంగిక వేధింపులకు గురి చేయడం, బలవంతంగా కార్మికులుగా, సేవకులుగా వినియోగించుకోవడం జరుగుతోంది. కుటుంబ పరిస్థితుల నేపథ్యం, ఎవరో చేసిన మోసాలకు బలైపోయిన బాధితులకు సరైన జీవనోపాధి అందించి సమాజంలో గౌరవంగా బతికేందుకు ఆత్మవిశ్వాసం అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. యాంటి హ్యూమన్ ట్రాఫికర్ యూనిట్ కలిసికట్టుగా పని చేస్తేనే బాలలు, మహిళల అక్రమ రవాణాను అరికట్టడం చాలా సులువు. పేదరికాన్ని రూపుమాపడం, ఆచార సంప్రదాయాలు, సామాజిక నిర్మాణాల్లో మార్పులు తీసుకు రావడం ద్వారా మానవ అక్రమ రవాణా నిరోధించడానికి వీలవుతుంది.

అట్ల శ్రీనివాస్ రెడ్డి
9703935321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News