Saturday, May 4, 2024

ఖరీదైన నగరంగా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

ఇళ్ల ధరల విషయంలో ప్రధాన నగరాలతో పోల్చితే రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్
మొదటి స్థానంలో ముంబయి
నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన నివేదికలో వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్: ఇళ్ల ధరల విషయంలో ప్రధాన నగరాలతో పోల్చితే రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. ఈ మేరకు ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. మొదటి స్థానంలో ముంబయి నిలవగా, స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన అఫర్డబుల్ ఇండెక్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆదాయంలో ఇంటి రుణం నెలవారీ కిస్తీ (ఈఎంఐ)కి చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. హైదరాబాద్‌లో 2023లో ఇళ్ల ధరలు 11 శాతం పెరిగినట్లు ఈ నివేదిక తెలియజేసింది. ప్రస్తుతం నగరంలో డిమాండ్‌కు అనుగుణంగా ఇళ్ల ధరలు సైతం పెరిగాయని రియల్‌రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
వివిధ నగరాల్లో ఇలా…
ఇక అందుబాటు ధర ఇళ్ల విషయానికొస్తే, ముంబయి కొనుగోలుదార్ల ఆదాయంలో 51 శాతం వరకు ఈఎంఐకి చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్‌లో మాత్రం ఇది 30 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 27 శాతం, బెంగళూరులో 26శాతం, చెన్నైలో 25శాతం, పుణెలో 24శాతం, కోల్‌కత్తాలో 24 శాతం, అహ్మదాబాద్‌లో 21శాతం మేర చెల్లింపు జరపాల్సి వస్తోంది. 2024,-25లో వృద్ధి రేటు పెరగడంతో పాటు, ద్రవ్యోల్బణం అదుపులో ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
నాలుగు జిల్లాల పరిధిలో స్వల్ప నమోదు
మరోవైపు రాష్ట్ర రాజధాని పరిధిలోని హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో (నాలుగు జిల్లాల పరిధి) నవంబర్ నెలలో నివాస ఆస్తుల రిజిస్ట్రేషన్లలో స్వల్ప వృద్ధి నమోదైందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో తెలిపింది. వార్షిక వృద్ధి 2శాతం ఉండగా, నెలవారీగా పెరుగుదల 8 శాతం నమోదైనట్లు వివరించింది. ఎన్నికల ప్రభావం భూములు, స్థలాల విక్రయాలపైనే తప్ప నివాసాలపై కాదని వీరి నివేదిక స్పష్టం చేస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News