న్యాయనిపుణులను ఆశ్రయించిన పోలీసులు, స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం పొందుతున్న బాధితురాలు
హైదరాబాద్ : మిర్యాలగూడాకు చెందిన మహిళ అత్యాచారం కేసులో పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తును డిజిపి ఆదేశాల మేరకు సిఐడికి అప్పగించనున్నారు. 139 మంది తనపై గత తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసిన వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు 49 పేజీల ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన విషయం విదితమే. ఈ కేసు దర్యాప్తు విషయంలో సిఐడి విభాగానికి అప్పగించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. కాగా మిర్యాలగూడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన జాబితాలో ప్రముఖుల పేర్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. దీంతో అందరి దృష్టి ఈ కేసుపై పడింది. పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే అడుగు ముందుకేయాలని భావిస్తున్నారు. ఈక్రమంలో డిజిపి మహేందర్రెడ్డి అనుమతిస్తే కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని అనుకుంటున్నారు. లేని పక్షంలో కేసును పంజాగుట్ట నుంచి సిసిఎస్కు బదిలీ చేయాలన్న ఆలోచనలు సైతం చేస్తున్నారు.
పంజాగుట్ట పోలీసులు బాధితురాలికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉందని, తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటే మరింత సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.ప్రస్తుతం బాధితురాలు ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతోందని, సదరు ఆ సంస్థ నిర్వాహకుడి సాయంతోనే ఆమె పోలీసులను ఆశ్రయించినట్లు పోలీసులు వివరిస్తున్నారు. ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టేందుకు పలు శాఖల, సంస్థల సహాయం కోరనున్నారు. ఇందులో భాగంగా కేసులోని 139 నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల కోసం పంజాగుట్ట పోలీసులు కసరత్తు ప్రారంభించారు.
Hyderabad woman 139 rape cases for CID