Monday, May 13, 2024

20 కోట్ల మందికి కరోనా వచ్చి పోయింది

- Advertisement -
- Advertisement -

ICMR's 2nd Survey reveals 1 in 15 individuals aged 10 yrs

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మహా ఆరోగ్య ఉపద్రవాన్నే తెచ్చిపెట్టింది. దేశంలో ఆగస్టు నాటికి దాదాపు 20 కోట్ల మందికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయిందని వెల్లడైంది. ప్రభుత్వ అధీకృత వైద్య పరిశోధనా మండలి (ఐసిఎంఆర్) చేపట్టిన సీరం సర్వేలో ఈ సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా దేశంలో పెద్ద ఎత్తున విరుచుకుపడినట్లు ఐసిఎంఆర్ సమగ్రరీతిలో జరిపిన రక్తనమూనా సర్వేతరువాతి గణాంకాలతో ఇప్పుడు స్పష్టం అయింది. ఆగస్టు నాటికి దేశంలో 15.9 కోట్ల నుంచి 19.6 కోట్ల మందికి కరోనా సోకిందని ఐసిఎంఆర్ జరిపిన అధ్యయనం తరువాతి నివేదికతో వెల్లడైంది. ఇక 10 ఏళ్లుపై బడ్డ వారిలో కనీసం ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటికీ కోవిడ్ సోకకుండా ఉన్న అత్యధికులలో ఇది వ్యాపించే ముప్పు కూడా ఉందని ఐసిఎంఆర్ తెలిపింది.

ఇప్పటి వరకూ వైరస్ నుంచి ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న వారిలో అత్యధికులలో వైరస్ వస్తుందని తెలిపారు. ఇది చాలా దారుణమైన రిస్క్ అవుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రామాణిక ఐసిఎంఆర్ నిర్వహించిన రెండవ జాతీయ స్థాయి సర్వేలో పలు ఇప్పటికీ వెలుగులోకి రాని విషయాలు స్పష్టం అయ్యాయి.. కోటానుకోట్ల మందికి కరోనా సోకి వెళ్లిపోయిందని అధ్యయనంలో కనుగొన్నారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ మధ్యకాలంలో ఐసిఎంఆర్ ఈ సర్వే నిర్వహించింది. ఇక ఇండియాలో 18 డ ఏళ్లు అంతకు మించిన యుక్త వయస్కులలోని వారి సంఖ్యను తీసుకుంటే వారిలో 7.1 శాతం మంది వైరస్‌కు గురయ్యారు. వారికి ఏదో ఓ దశలో వైరస్ వచ్చివెళ్లినట్లు గుర్తించారు. పిల్లల విషయానికి వస్తే తక్కువస్థాయిలో కరోనా సోకందని గుర్తించారు. మురికివాడలలోనే ఎక్కువగా వైరస్ వ్యాపించింది. ఇతర ప్రాంతాలను పోలిస్తే స్లమ్స్ ఎక్కువగా వైరస్ కాటుకు గురైంది. గ్రామీణ ప్రాంతాలలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. పల్లెలతో పోలిస్తే సగటు గణాంకాల మేరకు పరిశీలించుకుంటే పట్టణ, నగర భారతంలో వైరస్ నాలుగింతలు ఎక్కువగా ఉంది.

అయితే పలు ప్రాంతాలలో గుట్టుచప్పుడు కాకుండా కరోనా వైరస్ సోకి సాధారణ చికిత్సలోనే నయం అయిన కేసులు అత్యధికంగా ఉన్నారు. స్లమ్స్‌లో 15.6 శాతం, స్లమ్సేతర ప్రాంతాలలో 8.2 శాతం మందికి కరోనా వైరస్ వచ్చింది. తొలి సీరం సర్వే జరిపిన 21 రాష్ట్రాలకు చెందిన 70 జిల్లాల్లోనే ఇప్పుడు కూడా సర్వే జరిగింది. తొలి సర్వేను మే 11 నుంచి జూన్ 4వ తేదీ మధ్యలో నిర్వహించారు. ఇంతకుముందు 28,000 మంది రక్తనమూనాలను సేకరించారు. ఈసారి 29వేలకు పైగా మందిసీరం పరీక్షలు జరిగాయి. ముంబైలో అత్యధికంగా మురికివాడల్లోనే వైరస్ సోకిన విషయం ఇప్పటి సీరం పరీక్షలతో స్పష్టం అయింది. అక్కడ 57.8 శాతానికి పైగా వైరస్ పాజిటివ్ లక్షణలు కన్పించాయి. తరువాతి స్థానంలో ఢిల్లీలో 29.1 శాతం రికార్డు అయింది. కరోనా వైరస్ మగ ఆడ తేడా లేకుండా అందరిలో వ్యాపిస్తోందని, వస్తున్న శీతాకాలంలో మరింతగా వైరస్ సంక్రమించే వీలుందని సర్వే దశలో స్పష్టం అయింది.

ICMR’s 2nd Survey reveals 1 in 15 individuals aged 10 yrs

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News