Sunday, April 28, 2024

జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

IIT Madras Is India's Best Educational Institution

మొదటి ర్యాంక్ ఐఐటి మద్రాస్
రెండో స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు
14వ స్థానంలో ఐఐటి హైదరాబాద్

మన తెలంగాణ / హైదరాబాద్ : జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. ఓవరాల్ కేటగిరిలో మొదటి ర్యాంకు ఐఐటి మద్రాస్‌కు దక్కింది. రెండో స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు, మూడో స్థానంలో ఐఐటి బాంబే నిలిచాయి. ఐఐటి హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. యూనివర్శిటి కేటగిరిలో మొదటి స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు, రెండో స్థానంలో జెఎన్‌యు న్యూఢిల్లీ, మూడో స్థానంలో జామియా మిల్లియా ఇస్లామియా న్యూఢిల్లీ నిలిచాయి. యూనివర్శిటి ఆఫ్ హైదరాబాద్ 10 వ స్థానంలో నిలిచింది. ఉస్మానియా యూనివర్శిటీకి 22వ స్థానం దక్కింది. ఇంజనీరింగ్ కేటగిరిలో మొదటి స్థానంలో ఐఐటి మద్రాస్, రెండో స్థానంలో ఐఐటి ఢిల్లీ, మూడో స్థానంలో ఐఐటి బాంబే, 9వ స్థానంలో ఐఐటి హైదరాబాద్‌లు నిలిచాయి. మేనేజ్‌మెంట్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐఎం అహ్మదాబాద్, రెండో స్థానంలో ఐఐఎం బెంగళూరు, మూడో స్థానంలో ఐఐఎం కోల్‌కత్తా ఉన్నాయి.

ఫార్మసి కేటగిరిలో మొదటి స్థానంలో జామియా న్యూఢిల్లీ నిలువగా రెండో స్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎద్యుకేషన్ హైదరాబాద్, మూడో స్థానంలో పంజాబ్ యూనివర్శిటీ చండీగఢ్ నిలిచాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో మొదటి స్థానంలో ఐఐటి రూర్కి, రెండో స్థానంలో ఎన్‌ఐటి కాలికట్, మూడో స్థానంలో ఐఐటి ఖరగ్‌పూర్ నిలిచాయి. న్యాయ విద్యా విభాగంలో మొదటి స్థానంలో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా, బెంగళూరు, రెండో స్థానంలో నేషనల్ లా యూనివర్శిటీ న్యూ ఢిల్లీ, మూడో స్థానంలో సింబియాసిస్ లా స్కూల్ పూణే నాల్గవ స్థానంలో నల్సార్ యూనివర్శిటి నిలిచాయి. మెడికల్ కేటగిరి విషయానికి వస్తే ఎయిమ్స్ న్యూ ఢిల్లీకి మొదటి స్థానం దక్కగా పిజిఐఎంఐ చంఢీగఢ్‌కు రెండో స్థానం, క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూర్ (తమిళనాడుకు)కు మూడో స్థానం దక్కింది. డెంటల్ కేటగిరిలో మొదటి స్థానంలో సవితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ సైన్సెస్ చెన్నై, రెండో స్థానంలో మణిపాల్ కాలేజీ ఆప్ డెంటల్ సైన్సెస్ మణిపాల్, మూడో స్థానంలో డా.డీవైపాటిల్ విద్యాపీఠ్ పూణె నిలిచాయి. రిసెర్చ్ క్యాటగిరిలో మొదటి స్థానంలో ఐఐఎస్‌సి బెంగళూరు, రెండో స్థానంలో ఐఐటి మద్రాస్, మూడో స్థానంలో ఐఐటి ఢిల్లీ నిలువగా ఐఐటి హైదరాబాద్‌కు 12వ స్థానం దక్కింది.

జాతీయ స్థాయిలో మెరుగుపడిన ఒయు ర్యాంక్

జాతీయ స్థాయిలో ఉస్మానియా విశ్వవిద్యాలయం తన ర్యాంకును మరింత మెరుగు పరుచుకుంది. జాతీయ స్థాయి విద్యా సంస్థలు, యూనివర్శిటీల జాబితాలో గతేడాదితో పోల్చితే పది స్థానాలు మెరుగుపరుచుకుని 22వ స్థానాన్ని సాధించింది. 2022కు గాను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేసిన అత్యుత్తమ విద్యా సంస్థల జాబితాలో చోటు సంపాదించుకుంది. మొత్తం ఐదు విభాగాల్లో ఆయా విద్యా సంస్థలు సాధించిన ప్రగతి ఆధారంగా ఎంహెచ్‌ఆర్‌డి కోర్ కమిటి అధ్యయనం చేసింది. బోధన, అభ్యాసం, వనరులు, పరిశోధన, వృత్తి నైపుణ్య పద్దతులు, పట్టభద్రతా సాఫల్యం, భిన్న వర్గాలకు అందుబాటులో ఉండటం.. సమాజం పట్ల విద్యా సంస్థ అవగాహన ఆంశాల ఆధారంగా విద్యా సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలతో పోటీలో ఉస్మానియా మెరుగైన స్థానాన్ని సాధించింది.

ఏడాది కాలంగా ఉస్మానియా యూనివర్శిటీలో చేపట్టిన సంస్కరణలు ఫలితాన్నిచ్చాయని ఒయు ఉపకులపతి ప్రొఫెసర్ డి.రవీందర్ సంతోషం వ్యక్తం చేశారు. కోర్ కమిటి అధ్యయనంలో ఉస్మానియాకు గుర్తింపు దక్కడం తమ బాధ్యతను మరింత పెంచిందని గుర్తు చేశారు. ఈ ఫలితం విద్యార్థులు, అధ్యాపకులతో పాటు సిబ్బంది నిరంతర కృషి వల్లే సాధ్యమైందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విద్యాకేంద్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరం శ్రమిద్దామని పిలుపునిచ్చారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News