Tuesday, April 30, 2024

అభివృద్ధి వ్యయంలో మనమే నెం. 1

- Advertisement -
- Advertisement -

మొత్తం 18 పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణకు అగ్రస్థానం

మన తెలంగాణ/హైదరాబాద్:  అభివృద్ధి పనులు జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో దూసుకుపోతోందని కేంద్రప్రభుత్వ ఆర్థిక నివేదికలు స్పష్టంచేశాయి. ఒకవైపు సొంత ఆదాయాన్ని పెంచుకొంటూనే కొత్తగా అప్పులు చేయకుండా మరోవైపు అభివృద్ధి పనుల ను నిరాఘాటంగా కొనసాగిస్తున్న మొదటి 18 రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వశాఖ నివేదికలు స్పష్టంచేశాయి. ఈ మే రకు 2023-24వ ఆర్థ్ధిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అభివృద్ధి పనులకు (క్యాపిటల్ వ్యయం) రికార్డు స్థాయిలో 190 శా తం నిధులను ఖర్చు చేసిందని నివేదికలు స్పష్టంచేశాయి. గత ఆర్థ్ధిక సంవత్సరం (2022-23)లో నిర్దేశించుకొన్న లక్షాల కంటే ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలో 43 శాతం మూలధన వ్యయం సాధించాలని కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కు లక్షాలను నిర్దేశించింది. గడిచిన రెండు ఆర్థ్ధిక సంవత్సరాల్లో తెలంగాణ అనూహ్యమైన ప్రగతిని సాధించిందని వివరించాయి. అందులో భాగంగానే దేశంలోని 18 ప్రముఖ పెద్ద రాష్ట్రాలన్నీ కలిపితే సగటున 56 శాతం మూల ధనాన్ని ఖర్చు చేశాయని, అందులో తెలంగాణ రాష్ట్రం 190 శాతం మూల ధనాన్ని ఖర్చు చేసి రికార్డు సృష్టించిందని అంటున్నాయి. అందుకే ఈ అంశం జాతీయ మీడియాలో కూడా ప్రముఖంగా కథనాలు ప్రచురితం కావడంతో రాష్ట్ర మున్సిపల్ శాఖామంత్రి బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా ట్విట్టర్ (ఎక్స్)లో పంచుకున్నారు.

కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ ఇటీవల నిర్వహించిన క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ సమీక్షలో ఈ అంశాలు వెలుగులోకి వచ్చాయని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలు, పన్నుల విధానాలు, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం రూపొందించుకొన్న ప్రణాళికలు, పథకాలు జనరంజకంగా ఉండటంతోనే మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్)లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని కొందరు సీనియర్ అధికారులు సగర్వంగా వివరించారు. మూలధన వ్యయంలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా 142 శాతం అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేసిందని కూడా ఆ నివేదికలు స్పష్టంచేశాయి. ఒడిశా రాష్ట్రం 87శాతం, ఉత్తరప్రదేశ్ 85 శాతం నిధులను ఖర్చు చేశాయి. పొరుగున ఉన్న కర్ణాటక 32 శాతం నిధులను ఖర్చు చేసి వెనుకబడి పోయిందని ఆ అధికారులు వివరించారు. ప్రస్తుత ఆర్థ్ధిక సంవత్సరంలోని మొదటి ఆరునెలల వ్యవధిలోనే (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పనులపై సుమారు 20 వేల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిందని వివరించారు. గత ఆర్థ్ధిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలానికి 24 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశామని, కానీ ఈ ఏడాది యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన అనేక అభివృద్ధి పనులకు ఈ నిధులను ఖర్చు చేయడంతోనే జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్ట పెరిగిందని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే గుర్తించడం తమకు గర్వంగా ఉందని ఆ అధికారులు వివరించారు. ఈ ఆర్థ్ధిక సంవత్సరంలో మూలధనం వ్యయం కింద 37,524 కోట్ల 70 లక్షల రూపాయలను ఖర్చు చేసే విధంగా బడ్జెట్‌లో ప్రతిపాదించామని, కానీ మొదటి ఆరు నెలల కాలానికే సగానికిపైగా నిధులను ఖర్చు చేశామని వివరించారు. వాస్తవానికి దేశంలోని ఏ రాష్ట్రమైనా మొదటి ఆరు నెలలు ఆర్థ్ధికంగా కుదురుకోవడానికే సమయం తీసుకుంటుందని, మూల ధన వ్యయంపైన పెద్దగా దృష్టి పెట్టాదని, సహజంగా మూడో క్వార్టర్ నుంచి అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ, ఆ తర్వాత జనవరి నుంచి మార్చి నెల వరకూ క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌పైన దృష్టి సారిస్తారని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఆర్థ్ధిక సంవత్సరం ప్రారంభం నుంచీ అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ నిధులను విడుదల చేస్తుండటంతోనే ఈ ఘనతను సాధించగలిగామని వివరించారు. నీటిపారుదల, విద్యుత్తు, రోడ్లు, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖ తదితర ఇంజినీరింగ్ విభాగాల్లో చేపట్టిన అనేక అభివృద్ధి పనులకు నిధులను ఖర్చు చేయడంతోనే ఈ రికార్డును నెలకొల్పామని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకరించకపోయినప్పటికీ, ఎఫ్‌ఆర్‌బిఎం చట్టాన్ని గౌరవిస్తూనే, సెక్యూరిటీ బాండ్ల వేలం నుంచి నెలకు ఆరు వేల కోట్ల రూపాయలను సమీకరించుకునే అవకాశాలున్నప్పటికీ ఆ పనిచేయకుండా, ప్రజలపై అదనపు పన్నులను విధించకుండానే ఖజానాకు నిధులను రాబడుతూ, పాలనాపరమైన సంస్కరణలు, నిధుల వ్యయంలో కాస్తంత పిసినారితనాన్ని పాటిస్తూ పొదుపు చర్యలతో అభివృద్ధి పనులకు భారీగా నిధులను మళ్లించడంతోనే క్యాపిటల్ వ్యయంలో అగ్రస్థానంలో నిలవగలిగామని సగర్వంగా వివరించారు. ఇలా ఆదాయాన్ని పెంచుకోవడంతోనే అప్పులు చేయడం కూడా తగ్గిందనే అంశాలను కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధికమంత్రిత్వశాఖ కూడా గుర్తించిందని ఆ అధికారులు వివరించారు. అంతేగాక క్యాపిటల్ వ్యయంతోపాటుగా రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని, ఎందుకంటే ఉద్యోగుల జీతభత్యాలను కూడా పెంచిన రాష్ట్రం కూడా తెలంగాణ కావడం ముదావహమని వివరించారు. మిగతా రాష్ట్రాల్లో రెవెన్యూ వ్యయం అదనంగా పెరిగిందేమీలేదని, కాకుంటే పన్నుల వసూళ్ళల్లో ఆయా రాష్ట్రాలు కూడా తెలంగాణ విధానాలను అనుసరిస్తుండటంతోనే ఎక్కడా లోపాల్లేకుండా పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలుగుతున్నాయని వివరించారు. ఇలా అన్ని విధాలుగా, పగడ్బందీగా ఆర్థ్ధిక విధానాలను అమలు చేస్తుండటం మూలంగా తెలంగాణ రాష్ట్రం సొంత కాళ్లపై నిలబడిందని, లేకుంటే కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వకుండా ఎగనామం పెట్టినప్పటికీ డీలాపడకుండా ధైర్యంగా నిలదొక్కుకోగలిగామని ఆ అధికారులు వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News