ముంబయి: ఇకపై ఎటిఎంలలో నగదు విత్డ్రా, బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మరింత భారం కానుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్చేంజ్ ఫీజు పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసింది. ఇందుకు కేంద్ర బ్యాంకు కూడా సానుకూలంగా స్పందించే అవకాశాలున్నాయని ఓ జాతీయ మీడియా కథనం వెల్లడించింది. ప్రస్తుతం ఒక బ్యాంకుకు చెందిన కార్డును వేరే బ్యాంకుకు చెందిన ఎటిఎంలో వినియోగించినప్పుడు సదరు ఎటిఎం ఆపరేటర్కు ఖాతాదారుడు ఇంటర్చేంజ్ ఫీజు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. కస్టమర్లకు అయిదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా ఇస్తూ ఆపైన జరిగే లావాదేవీలకు కొంత మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారు. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు ట్రాన్సాక్షన్లపై ( విత్డ్రాలు) రూ.15, నగదు రహిత ట్రాన్సాక్షన్ల (బ్యాలెన్స్ ఎంక్వైరీ)పై రూ.5 చొప్పున ఈ చార్జీలున్నాయి.
అయితే ఈ ఇంటర్చేంజ్ఫీజు చార్జీలను పెంచాలని కోరుతూ భారత ఎటిఎం ఆపరేటర్ల సంఘం ఈ నెల 13న ఆర్బిఐకి ఒక లేఖ రాసింది. ఎటిఎంల భద్రత, నిర్వహణ ప్రమాణాలను ఆర్బిఐ పెంచిన నేపథ్యంలో ఎటిఎంల నిర్వహణ భారంగా మారిందని,దీనివల్ల తమ వ్యాపారాలు భారీగా దెబ్బతింటున్నాయని ఆ లేఖలో పేర్కొంది. ఈ పరిణామాల కారణంగా కొత్త ఎటిఎంలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నామని తెలిపింది. అందుకే ఆదాయాలను పెంచుకోవాలని అనుకుంటున్నామని పేర్కొంది. దేశంలో ఎటిఎంల వినియోగం, వ్యాప్తిని పెంచేందుకు ఆర్బిఐ ఇటీవల ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ గత డిసెంబర్లో ఆర్బిఐకి తమ సిఫార్సులను అందజేసింది. ఇంటర్చేంజ్ ఫీజు చార్జీలను పెంచాలని ఆ కమిటీ తన నివేదికలో ప్రధానంగా సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో ఎటిఎం ఇంటర్ చేంజ్ ఫీజును రూ.17(నగదు ట్రాన్సాక్షన్లు), రూ. 7( నగదు రహిత ట్రాన్సాక్షన్స్)కు పెంచాలని కమిటీ తన నివేదికలో ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉచిత ట్రాన్సాక్షన్ల సంఖ్యను మూడుకు పరిమితం చేయాలని కూడా కమిటీ సూచించింది. ఇక గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఈ ఫీజులను రూ.18, రూ.8లకు పెంచుతూ.. ఉచిత లావాదేవీలను ఆరుకు పెంచాలని సూచించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలను కేంద్ర బ్యాంక్ పరిశీలిస్తోంది. దీనిపై ఎటిఎం ఆపరేటర్లకు అనుకూలంగా ఆర్బిఐ నిర్ణయం తీసుకోవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. అదే జరిగితే ఖాతాదారుడిపై అదనపు భారం తప్పదు.