ఓటింగ్కు దూరంగా ఇండియా
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో మయన్మార్పై తీర్మానం విషయంలో జరిగిన ఓటింగ్కు భారతదేశం గైర్హాజరు అయింది. ఈ తీర్మానంలోని అంశాలలో భారతదేశ ఆందోళన, అభిప్రాయాలు పొందుపర్చలేదని, దీనికి నిరసనగానే ఓటింగ్కు దూరం కావాలని నిర్ణయించినట్లు భారత ప్రతినిధి తెలిపారు. శుక్రవారం ఈ తీర్మానానికి జనరల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2020 నవంబర్ 8వ తేదీన జరిగిన మయన్మార్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో ప్రజలు వెలువరించిన స్వేచ్ఛాయుత తీర్పును మయన్మార్ సైనిక పాలకులు గౌరవించాలని, అక్కడి అత్యయిక స్థితిని ఎత్తివేయాలని, మానవ హక్కులను గౌరవించాలని తీర్మానంలో తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన పార్లమెంట్ పునః ప్రారంభానికి వీలు కల్పించాలని ఇందులో తెలిపారు. అయితే ఈ తీర్మానంలో తమ సూచనలు పొందుపర్చకపోవడాన్ని భారత్ ప్రస్తావించింది. ఇరుగుపొరుగు దేశాలు వెలిబుచ్చే అభిప్రాయాలతోనే మయన్మార్లో సంప్రదింపులు, నిర్మాణాత్మక ప్రక్రియకు వీలేర్పడుతుందని భారతదేశం తెలిపిందని, అంతర్జాతీయ సమాజం మయన్మార్ సమస్యకు శాంతియుత పరిష్కారం దిశలో పాటుపడుతున్న దశలో తమ వైఖరికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని భారతదేశం ప్రశ్నించింది. తీర్మానం ఓటింగ్కు వెళ్లగా 119 దేశాలు మద్దతు ప్రకటించాయి. అయితే బెలారస్ వ్యతిరేకించింది. ఇండియా , రష్యా, చైనా సహా 35 దేశాలు ఓటింగ్లో పాల్గొనలేదు.