Saturday, April 27, 2024

చిగురిస్తున్న ‘ఇండియా’

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దింపడమనే ఏకైక లక్షంతో కూటమిగా ఏర్పాటయిన ప్రతిపక్ష పార్టీలు ఆ దిశగా పురోగతి సాధిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఏడాది జూన్‌లో ‘ఇండియా’ కూటమిగా ఏర్పడిన విపక్షాలు ఆ తర్వాత సీట్ల సర్దుబాటు విషయంతో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుతో విసిగి పోయి ఒకదాని తర్వాత ఒకటిగా వేరు కుంపట్లు పెట్టుకోవడం మొదలుపెట్టాయి. దీంతో కూటమి మనుగడే ప్రశ్నార్థకమయింది. ముందుగా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధ్యక్షుడు నితీశ్ కుమార్ కాంగ్రెస్, ఆర్‌జెడిలతో కూడిన ‘మహా ఘట్‌బంధన్’కు గుడ్‌బై చెప్పి తిరిగి బిజెపితో జతకట్టడంతో ఆ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అదే సమయంలో కూటమిలో ప్రధాన భాగస్వాములయిన బెంగాల్‌లో మమత పార్టీ తృణమూల్ కాంగ్రెస్, యుపిలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ తమ తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేశాయి.

అయితే కేవలం వారాల వ్యవధిలోనే రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఆ పార్టీలు ఒక్కటొక్కటిగా తిరిగి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు సిద్ధమవుతున్నాయి. ఈ విషయంలో అందరికన్నా అఖిలేశ్ ఓ అడుగు ముందుకేసి కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటును ఖరారు చేసుకున్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా యుపిలో ఎక్కువ స్థానాలను గెలుచుకు తీరాల్సిందే. 80 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అత్యధిక స్థానాలను దక్కించుకుని తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఇప్పుడు అయోధ్యలో రామాలయ నిర్మాణం, రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనుల కారణంగా అది ఓటర్లకు మరింత చేరువ అవుతోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరో వైపు మాజీ ముఖ్యమంత్రి , బిఎస్‌పి అధినేత్రి మాయావతి రాష్ట్రంలో తాము ఏ పార్టీతోను పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశారు.ఈ పరిస్థితుల్లో మొన్నటిదాకా పొత్తుల విషయంలో బెట్టు చేస్తూ వచ్చిన కాంగ్రెస్, ఎస్‌పిలు రెండూ కూడా కలిసి పోటీ చేయడం వల్ల ఇరువురికీ లాభమనే వాస్తవాన్ని గ్రహించాయి.

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ స్వయంగా రంగంలోకి దిగి అఖిలేశ్‌తో చర్చలు జరపడంతో రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారయిందన్న వార్తలు వచ్చాయి. దీంతో సీట్ల సర్దుబాటు తేలేదాకా యుపిలో జరుగుతున్న రాహుల్ గాఃధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేది లేదని భీష్మించుకు కూర్చున్న అఖిలేశ్ ఇప్పుడు యాత్రలో పాల్గొంటానని ప్రకటించడం విశేషం. ఇది రెండు పార్టీల కార్యకర్తలకు నైతిక బలాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.మరోవైపు కేజ్రీవాల్ ‘ఆప్’ పరిస్థితి కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించిన ఆ పార్టీ పంజాబ్‌లో కూడా తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పి కాంగ్రెస్‌ను పూర్తిగా ఆత్మరక్షణలో పడేసింది. అయితే గత కొద్ది రోజులగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేజ్రీవాల్‌ల మధ్య అనేక దఫాలు చర్చలు జరగడంతో ఇప్పుడు ‘ఆప్’ మెట్టు దిగి వచ్చింది. ముందుగా ఢిల్లీలో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లు, ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.

అలాగే గోవా, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ రెండు పార్టీల మధ్య అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ మోడీ సొంతరాష్ట్రమైన గుజరాత్‌లో ఆప్ భరూచ్, భావ్‌నగర్ స్థానాల్లో పోటీ చేయనుండగా, మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ రెండు స్థానాలకు ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. అలాగే పది లోక్‌సభ స్థానాలున్న హర్యానాలో ఆప్ ఒక చోట పోటీ చేయవచ్చని తెలుస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమయిన చండీగఢ్ లోక్‌సభ స్థానంలోనూ కాంగ్రెస్ బరిలో ఉంటుంది. అయితే ‘ఆప్’ అధికారంలో ఉన్న పంజాబ్‌లో మాత్రం ఇంకా ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరగలేదు. గత లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించగా ఆప్ ఒక్క చోట మాత్రమే గెలుపొందింది. అయితే ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’ అనూహ్యంగా తిరుగులేని విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. మారిన రాజకీయ పరిస్థితులతో ఆ పార్టీ రాష్ట్రంలో మెజారిటీ స్థానాలకోసం పట్టుబడుతోంది. అయితే ఇప్పుడు పంజాబ్ విషయంలో కూడా ఇరు పార్టీలు ఓ మెట్టు దిగి సీట్ల సర్దుబాటుకు అంగీకరించే అవకాశం లేకపోలేదని విశ్లేషకుల అంచనా.

‘ఆప్’లో ఇంత మార్పు రావడానికి ఇటీవలి చండీగఢ్ మేయర్ ఎన్నిక పరిణామాల ప్రభావం కీలక పాత్ర పోషించిందని పరిశీలకుల అంచనా. ఈ పరిణామం ఆ రెండు పార్టీలపైనే కాకుండా ఇండియా కూటమిలోని అన్ని పక్షాలపై ప్రభావం చూపించూపించింది. ‘కలసి ఉంటే కలదు సుఖం’అన్న సత్యాన్ని ఆ పార్టీలు గ్రహించినట్లు కనిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్, కూటమి భాగస్వాముల మధ్య పొత్తుకు ఎలాంటి ఇబ్బందులూ ఇప్పటివరకు లేవు. ఆర్‌జెడి, వామపక్షాలు లాంటి పార్టీలతో కాంగ్రెస్‌కు ఎలాంటి పేచీ ఇప్పటివరకు లేదు. ఇక మిగిలింది పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర మాత్రమే. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా దీదీ పార్టీ టిఎంసి, ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేనలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే కూటమిలో పొత్తులు దాదాపుగా కుదిరినట్లే. మార్చి రెండో వారంలో లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించవచ్చన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం సీట్ల సర్దుబాటు చర్చల ప్రక్రియను మరింత వేగవంతం చేసే అవకాశాలున్నాయి. నెల రోజుల క్రితం ఉంటుందా లేదా అనే స్థితిలో ఉన్న‘ఇండియా’ కూటమిలో ఇప్పుడు అన్ని పార్టీలు తిరిగి ఏకతాటిపైకి వస్తుండడం చూస్తే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని కలిసికట్టుగా ఢీకొనాలన్న ప్రతిపక్షాల లక్షం దాదాపుగా నెరవేరుతుందనిపిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News