ఇప్పుడు విశ్రాంతి, నిర్లక్షం వద్దు, కేంద్రం సాహసోపేత సంస్కరణలు చేపట్టింది, దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుంది: ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ : కరోనా వైరస్పై పోరాటంలో భారతదేశం కీలక దశలోకి ప్రవేశించిందని, ఈ తరుణంలో విశ్రాంతి తీసుకోవద్దని, నిర్లక్షం పనికిరాదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాలతో దేశీయ ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకోనుందని ఆయన అన్నారు. పండిట్ దీన్దయాల్ పెట్రోలియం యూనివర్సిటీ (పిడిపియు) స్నాతకోత్సవం వేడుకలో విద్యార్థులతో ముకేశ్ ఈవిధంగా అన్నారు. ప్రధాని విశ్వాసం, నమ్మకం దేశవ్యాప్తంగా స్ఫూర్తిని నింపాయని అన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కోవిడ్ 19 కేసుల సంఖ్య మళ్లీ పెరగడాన్ని ఆయన గుర్తుచేశారు. అహ్మదాబాద్లో కేసులు పెరగడంతో అధికారులు మళ్లీ ఆంక్షలు విధించగా, అలాగే దేశ రాజధాని ఢిల్లీలోనూ మళ్లీ కరోనా కట్టడి చర్యలు తీవ్రతరం చేశారు. కాగా ప్రభుత్వం చేపట్టిన సాహసోపేతమైన సంస్కరణలు రాబోయే సంవత్సరాల్లో వేగంగా ఆర్థిక పునరుజ్జీవనం, వేగవంతమైన పురోగతికి దారితీస్తాయని అన్నారు. భారతదేశానికి పురాతన భూమి, చరిత్రలో కూడా ఇది చాలా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొందని ఆయన అన్నారు. భారతదేశం గతంలో కంటే ఇప్పుడు బలంగా ఉద్భవించింది, ఎందుకంటే తట్టుకునే శక్తి ప్రజలలో, సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిందని అన్నారు. కోవిడ్ -19 అనంతరం అద్భుతమైన వృద్ధిని చూస్తామని ముకేశ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేషన్ విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందొద్దని, విశ్వాసంతో క్యాంపస్ నుంచి రావాలని అన్నారు.
రాబోయే రెండు దశాబ్దాల్లో..
వృద్ధి అపూర్వమైన అవకాశాలను ఇస్తుందని, రాబోయే రెండు దశాబ్దాల్లో భారతదేశం ప్రపంచంలోని మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ మాట్లాడుతూ, పర్యావరణానికి హాని కలిగించకుండా దేశీయ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడానికి శక్తిని ఉత్పత్తి చేయగలమా? అనేది ప్రపంచం ముందు ఉన్న సవాలు అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచం అవసరమైన దాని కంటే రెట్టింపు శక్తిని ఉపయోగిస్తుంది. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత తలసరి ఇంధన అవసరాలు రెట్టింపు అవుతాయి. ఆర్థికంగా సూపర్ పవర్గా మారడంతో పాటు స్వచ్ఛమైన, గ్రీన్ ఎనర్జీ సూపర్ పవర్గా మారాలనే రెండు లక్ష్యాలను ఒకే సమయంలో భారత్ సాధించాల్సిన అవసరం ఉందని అన్నారు.