Friday, May 10, 2024

ఎన్నికల కోసం ఈవిఎంల పరిశీలన పూర్తి

- Advertisement -
- Advertisement -

పోలింగ్ స్టేషన్లలో వేగంగా ఏర్పాట్లు
బిఎల్‌ఓల ద్వారా ఎపిక్ కార్డులు పంపిణీ
బందోబస్తు కోసం పక్క రాష్ట్రాల పోలీసులు:  సిఈవో వికాస్‌రాజ్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఈవిఎంల పరీశీలన పూర్తి అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఆదివారం తమ సిఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలింగ్ సజావుగా జరిగేందుకు అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లు వేగంగా చేస్తున్నట్లు చెప్పారు. 1.68లక్షల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చామని, 26,660 హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 45 లక్షల మందికి ఎపిక్ కార్డుల ప్రింటింగ్ పూర్తి చేసి బిఎల్‌ఓ ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

2290 మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎన్నికల విధులు 2.5 లక్షల ఉద్యోగులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల బందోబస్తుకు రాష్ట్రానికి చెందిన 45 వేల మంది పోలీసులు, 23,500 హోమ్ గార్డ్ ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని వెల్లడించారు. 3వేల మంది ఎక్సైజ్ పోలీసులు, 50 వేల మంది రిజర్వ్ పోలీసులు విధుల్లో ఉంటారని తెలిపారు. వీటితో పాటు కేంద్ర బలగాలు విధుల్లో ఉంటాయని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రతి పోలింగ్‌స్టేషన్‌లో వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంటాయన్నారు. బ్రెయిలీలో కూడా 40 వేల బ్యాలెట్ ప్రింటింగ్ చేశామన్నారు. 190 కేంద్ర కంపెనీల బలగాలు తెలంగాణలో విధుల్లో ఉండనున్నాయన్నారు. ఆదివారం రాత్రి వరకు 74 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణకి రానున్నాయని తెలిపారు.

రాష్ట్రంలో పోలింగ్‌కి 48 గంటల ముందు 144 సెక్షన్ ఉంటుందని.. ఎవరూ ప్రచారాలు, డోర్ డోర్ టు ప్రచారం చేయవద్దని హెచ్చరించారు. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు స్వస్ధలాలకు వెళ్లాలన్నారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు కేటీఆర్‌ను వివరణ కోరామని ఇంకా ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ నాయకులు ఇతర పార్టీ నాయకులపై ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, కొన్నింటికి పరిశీలన సంబంధిత నాయకులకు నోటీసులు పంపించినట్లు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News