కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత
అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం
శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో అధీన రేఖ వెంబడి నిఘా పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే కశ్మీర్ ఉగ్రవాదులకు ఆయుధాలనుజారవిడవడానికి దాన్ని ఉపయోగించి ఉంటారని సైన్యం అనుమానిస్తోంది. ఆర్మీ పరిభాషలో పీర్ పంజాల్గా వ్యవహరించే కశ్మీర్ లోయలోని సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో అదీన రేఖ వెంబడి ఎలాంటి ఎగిరే వస్తువు కనిపించినా అప్రమత్తంగా ఉండాలని అన్ని ప్రాంతాల్లోని బలగాలను ఆదేశించినట్లు ఆర్మీకి చెందిన 15వ కోర్ కమాండ్ చీఫ్ లెఫ్టెనెంట్ జనరల్ బిఎస్ రాజు పిటిఐకి చెప్పారు. కశ్మీర్లో దాగి ఉన్న ఉగ్రవాదులకు ఆయుధాలు, మందుగుండు కొరత భారీగా ఉంది.సరిహద్దు ఆవలివైపు (పాకిస్థాన్)నుంచి ఏదో ఒక రూపంలో సాయంకోసం వీరంతా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. గత జూన్లో భారత సైన్యం జమ్మూ ప్రాంతంలోని కతువా జిల్లాలో అత్యధునాతన రైఫిల్, ఏడు గ్రనేడ్లు అమర్చి ఉన్న ఒక పాకిస్థానీ డ్రోన్ను బిఎస్ఎఫ్ కూల్చేసింది. చైనాలో తయారైన ఆ డ్రోన్ బరువు 17.5 కిలోల బరువుండగా, అమెరికాలో తయారైన అత్యధునాతన ఎం 4 సెమీ ఆటోమేటిక్ కార్బైన్, ఏడు చైనా గ్రెనేడ్లు దానిలో ఉన్నాయి.
నాలుగు బ్యాటరీలు, ఒక రేడియో రిసీవర్ సెట్, రెండు జిపిఎస్ను కూడా బిఎస్ఎఫ్ దానినుంచి స్వాధీనం చేసుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంలో ఇది కొత్త కోణమని రాజు చెప్పారు. సరిహద్దు ఆవలివైపు నుంచి వచ్చే ఏ ఎగిరే వస్తువునైనా కూల్చేయండని సైనికులకు ఆదేశాలు ఇచ్చినట్లు కూడా ఆయన తెలిపారు. అంతేకాకుండా ఉగ్రవాదులు గొర్రెల కాపరులు, లేదా సంచార జాతుల ముసుగులో ఆయుధాలను తీసుకోవడానికి వచ్చే అవకాశం ఉన్నందున జనం కదలికలపైనా గట్టి నిఘా పెట్టినట్లు కూడా ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో అధీన రేఖ వెంబడి ఆయుధాలు,మందుగుండు డంపఃలను గుర్తించడం జరిగిందని, దీనిబట్టి సరిహద్దులకు ఆవలివైపునుంచి బూటకపు చొరబాట్లు సృష్టించి, ఆయుధాలు, మందుగుండు పడవేసి, తిరిగి వెళ్లిపోతున్నారనే దానికి ఇది నిదర్శనమని ఆయన చెప్పారు. పటిష్టమైన చొరబాట్ల వ్యతిరేక వ్యవస్థ ఉండడమే దీనికి కారణమని కూడా ఆయన చెప్పారు. భారత్, చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అధీన రేఖ వెంబడి పాక్ తన బలగాలను మోహరించిందా అని అడగ్గా, అలాంటిదేబీ తమ దృష్టికి రాలేదని రాజు చెపారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.
ISI Drops weapons by drones to terrorists in Kashmir