సమాచారభవన్లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్, మాస్కుల
పంపిణీలో రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ సోకకుండా జర్నలిస్టులందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సూచించారు. ఆదివారం మాసబ్ట్యాంక్లోని సమాచారభవన్లో జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు, శానిటైజర్, మాస్కులను అల్లం నారాయణ, ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్లు పంపిణీ చేశారు. నగరంలో పని చేస్తున్న దాదాపు 1,200ల మంది జర్నలిస్టులతో పాటు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, స్ట్రింగర్లు, పార్ట్ టైం జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు సమాజానికి వెలకట్టలేని సేవలు అందిస్తున్నారన్నారు.
జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచు కొని జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మొదటి ప్రయత్నంగా నిత్యావసర సరుకులను అందజేస్తున్నామన్నారు. జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టులు సామాజిక దూరం తప్పక పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి ఎస్. విజయ్ గోపాల్, మేనేజర్ లక్ష్మణ్ కుమార్, టియూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, టెమ్జూ ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, టియూడబ్ల్యూజే నగర అధ్యక్షులు పి.యోగానంద్, జర్నలిస్టుల సంఘాల నాయకులు నవీన్ కుమార్, యూసుఫ్బాబు, భాస్కర్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.