Sunday, April 28, 2024

కంటి వెలుగుకు భారీ స్పందన

- Advertisement -
- Advertisement -

కంటి వెలుగుకు భారీ స్పందన….
కోటి 34 లక్షల 53 వేల 975 మందికి పరీక్షలు పూర్తి
19 లక్షల 95 వేల 659 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ
9875 పంచాయతీ వార్డులు, 3058 మున్సిపల్ వార్డులలో పరీక్షలు
ఇప్పటివరకు 85 శాతం మందికి పరీక్షలు పూర్తి చేసినట్లు వైద్యాధికారులు వెల్లడి
మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “కంటి వెలుగు’ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోటి 34 లక్షల 53 వేల 975 మందికి కంటి పరీక్షలు చేశారు. దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 19 లక్షల 95 వేల 659 మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు అందజేసారు. ఇందులో 63లక్షల 18వేల 637 మంది పురుషులు, 71 లక్షల 20 వేల 703మంది స్త్రీలు, 7042 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు. 98లక్షల 77 వేల 475 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయ్యింది.

రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మారిన జీవన విధానం, వివిధ రకాల పని ఒత్తిళ్లతో కంటి సమస్యల పై ప్రజలు దృష్టి పెట్టాలని, అవగాహన లోపంతో ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నందున సిఎం కెసిఆర్ మార్గదర్శనంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుంచి జూన్ 15 వరకు వంద రోజుల కార్యక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు 85 శాతం కంటి పరీక్షలు పూర్తి అయ్యాయి. సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. ఈ పథకాన్ని వంద రోజుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లాలో కార్యక్రమం విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులు విశేష కృషి చేస్తున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నివారించదగ్గ అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నది. 2018లో ప్రారంభించిన మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా, కోటి 50 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షల నిర్వహించి, 50 లక్షల కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సారి 100 పని దినాల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 69 రోజుల పనిదినాలల్లో ఒక కోటి 34 లక్షల 53 వేల 975 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసుకొని అనుకున్న లక్ష్యానికి మించి రెండు కోట్లకు చేరుకునే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది.

డీఎంహెచ్‌ఓలు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రాం ఆపీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, కంటి వైద్యులు, సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశవర్కర్లు, డీఈవోలు సహా, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం పురోగతిపై రోజువారీగా ముఖ్యమంత్రి సమీక్ష చేస్తూ ఎంత మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు, ఎంత మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు అనే విషయాలను ప్రతి రోజు అధికారుల ద్వారా వివరాలు తెలుసుకుంటున్నారు. స్క్రీనింగ్ పూర్తి చేసిన తర్వాత వెంటనే రీడింగ్ గ్లాసెస్, నాలుగు వారాల్లోగా ప్రిస్కిప్షన్ గ్లాసెస్ తప్పకుండా అందేలా చూస్తున్నారు. క్యాంపుల నిర్వహణ ప్రణాళికతో నిర్వహిస్తున్నారు. సిబ్బందికి అవసరమైన భోజన వసతి, వాహన సదుపాయాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానిక వైద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News