Monday, April 29, 2024

అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్‌ఎండిఏ..

- Advertisement -
- Advertisement -

అక్రమ కట్టడాలను నేలమట్టం చేసిన హెచ్‌ఎండిఏ
పెద్ద అంబర్‌పేట పరిధిలో ఐదుగురిపై క్రిమినల్ కేసు నమోదు
రూ.45 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల కబ్జాను నివారించిన అధికారులు
మనతెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల స్థలంలో (రూ.45 కోట్ల విలువ చేసే) కబ్జాదారులు నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్‌ఎండిఏ) అధికారులు శనివారం నేలమట్టం చేశారు. విజయవాడ జాతీయ రహదారి సమీపంలో హెచ్‌ఎండిఏ యాజమాన్యం హక్కులు కలిగిన ఈ మూడు ఎకరాల ఖాళీ స్థలంపై కొందరు కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు అధికారులు గురించారు.

దీంతో హెచ్‌ఎండిఏ భూ రికార్డులను సరిచూసుకొని స్థానిక తహసీల్దార్, పోలీసుల సహకారంతో హెచ్‌ఎండిఏ, ఓఆర్‌ఆర్ ల్యాండ్ అక్వీజేషన్ అధికారి వి.విక్టర్, ఎన్ ఫోర్స్ మెంట్ డీఎస్పీ (ఇంచార్జీ) వెంకటేష్ తమ సిబ్బందితో శనివారం అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ఐదు ఇళ్లు, ప్రహరీ గోడలు, గేట్లను అధికారులు ధ్వంసం చేశారు. కబ్జాలకు పాల్పడిన ఐదుగురిని గుర్తించి వారిపై అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో హెచ్‌ఎండిఏ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

2010లో పంచనామా నిర్వహించి హెచ్‌ఎండిఏకు అప్పగింత
అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్ద అంబర్‌పేట గ్రామంపరిధిలోని ఈ మూడు ఎకరాల భూములను 2010 డిసెంబర్ 31వ తేదీన అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పంచనామా చేసి హెచ్‌ఎండిఏకు అప్పగించారు. ఔటర్ రింగ్‌రోడ్డులో భూములు కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఈ భూమిని ఇచ్చేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భూమిని హెచ్‌ఎండిఏకి కేటాయించిందని అధికారులు తెలిపారు. హెచ్‌ఎండిఏ భూముల జోలికి వస్తే కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News