ఆత్మపరిశీలన చేసుకోవాలన్న కార్తి చిదంబరం
చెన్నై: బీహార్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసిన నేపథ్యంలో పార్టీలో ఆత్మపరిశీలన, సంప్రదింపులకు సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ఎంపి కార్తి పి చిదంబరం వ్యాఖ్యానించారు. ఆత్మపరిశీలన, ఆలోచన, సంప్రదింపులు, కార్యాచరణకు సమయం ఆసన్నమైందంటూ మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం కుమారుడైన కార్తి సోమవారం ట్వీట్ చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలను రీట్వీట్ చేస్తూ కార్తి ఈ వ్యాఖ్యలు చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల పంపకంలో జరిగిన జాప్యమే పార్టీలో మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసిందంటూ కాంగ్రెస్కు చెందిన మరో సీనియర్ నాయకుడు తారిఖ్ అన్వర్ వ్యాఖ్యానించిన మరుసటి రోజే కార్తి ఈ విధంగా స్పందించడం గమనార్హం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 70 స్థానాలలో కేవలం 19 స్థానాలలోనే కాంగ్రెస్ గెలుపొందిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ఆర్జెడి నాయకుడు తేజస్వి యాదవ్ సారథ్యంలోని మహాగట్బంధన్కు 110 స్థానాలు దక్కి అధికార పీఠాన్ని చేజార్చుకుంది. 243 అసెంబ్లీ స్థానాలుగల బీహార్లో 125 స్థానాలు గెలుచుకుని బిజెపి సారథ్యంలోని ఎన్డిఎ మరోసారి తన అధికారాన్ని నిలబెట్టుకుంది.