Friday, May 3, 2024

సర్వమతాల సంరక్షకుడు కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో ఆధ్యాత్మిక వైభవం పరిఢవిల్లుతోందని, సర్వమతాలకు సంరక్షణ కల్పించడం జరుగుతోందని అర్బన్ ఎంఎల్‌ఏ బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. బుధవారం నగరంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని సిఎస్‌ఐ, శ్రీనీలకంఠేశ్వర ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఏ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో రాష్ట్రంలోని ఆలయాలు సరికొత్త వైభవాన్ని సంతరించుకుని ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయన్నారు.

సర్వమతాల సంరక్షకుడు ముఖ్యమంత్రి కెసిఆర్, బతుకమ్మ, రంజాన్, క్రిస్టియన్‌ల పండగలను ఘనంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. లోక కళ్యాణార్థం మహాచండీయాగం, సుదర్శన యాగం అనేక పూజలు నిర్వహించిన గొప్ప ఆధ్యాత్మిక వేత్త కెసిఆర్ అని కొనియాడారు. సిఎం కెసిఆర్ పాలన, యాగ ఫలాల వల్ల తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. భగవంతుడికి, భక్తులకు వారధిగా ఉన్న అర్చకులకు వేతనాలు పెంచి వారికి గౌరవాన్ని నిలిపారని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి పరిషత్‌ను ఏర్పాటుచేసి వారి సంక్షేమానికి కృషి చేశారని అన్నారు. 1250 కోట్ల రూపాయలతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి కలియుగ వైకుంఠంగా మార్చారని అన్నారు.

అలాగే వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాలను 100 కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. భద్రాద్రి రామచంద్ర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా ఉన్న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు వచ్చేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. శబరిమల, కాశీకి వెళ్లే భక్తుల సౌకర్యార్థం వసతి గృహాలను నిర్మిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో కొత్త ఆధ్యాత్మిక వైభవాన్ని తీసుకువచ్చినందున భగవంతుడు చల్లగా చూడాలని మనస్ఫూర్త్తిగా ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, నుడా ఛైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, నీలకంఠేశ్వర ఆలయ కమిటీ ఛైర్మన్ బిల్ల మహేష్, ప్రధాన అర్చకులు కులాచారి సంతోష్, కోశాధికారి హరిబాబు, ఈఓ వేణు, ఆలయ సిబ్బంది, నగర ప్రముఖులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News