Sunday, April 28, 2024

స్టాలిన్‌తో కేజ్రీవాల్ భేటీ..

- Advertisement -
- Advertisement -

స్టాలిన్‌తో కేజ్రీవాల్ భేటీ
కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆప్‌కు డిఎంకె మద్దతు

చెన్నై: ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీల అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన పోరును ఉధృతం చేశారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతరేకంగా మద్దతుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విపక్షాల మద్దతును కూడగడుతున్న కేజ్రీవాల్ తాజాగా గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత ఎంకె స్టాలిన్‌ను కలిశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్‌తో కలిసి చెన్నై వచ్చిన కేజ్రీవాల్ స్టాలిన్‌తో సమావేశమయ్యారు.

అనంతరం కేజ్రీవాల్ విలేఖరులతో మాట్లాడుతూ ‘ ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై చర్చించాం. కేంద్రం నిర్ణయం అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం. ఢిల్లీ ప్రజలకు, ఆమ్ ఆద్మీ పార్టీకి డిఎంకె అండగా ఉంటుందని స్టాలిన్ మామీ ఇచ్చారు’ అని చెప్పారు. స్టాలిన్ మాట్లాడుతూ ‘ మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌ను ఉపయోగించి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది.కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను డిఎంకె తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వాలని నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా’ అని అన్నారు. ఒక వేళ బిజెపియేతర పార్టీలన్నీ ఏకమయితే రాజ్యసభలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని కేజ్రీవాల్ చెబుతున్న విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా కేజ్రీవాల్ ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, తెలంగాణ సిఎం కె. చంద్రశేఖర్ రావు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్ తదితర నేతలతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కాంగ్రెస్ కూడా తమకు మద్దతు ఇవ్వాలని కేజ్రీవాల్ కోరారు. ఈ విషయంలో తాను ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ నేత రాహుల్ గాంధీల అపాయింట్‌మెంట్ కోరానని, వారు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని ఆయన చెప్పారు. రాజ్యసభలో కేంద్రం ఆర్డినెన్స్‌ను ఓడించినట్లయితే 2024 లోక్‌సభ ఎన్నికలకు అదే సెమీఫైనల్ అవుతుందని కేజ్రీవాల్ ఇప్పటికే స్పష్టం చేశారు కూడా. కాగా శుక్రవారం జార్ఖండ్ సిఎం హేమంత్ సోరేన్‌తో భేటీ కానున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News