Sunday, April 28, 2024

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో రేషన్ దుకాణాల్లో మోడీ బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందా అని ప్రతిపక్ష ఎమ్‌ఎల్‌ఎ పి. అబ్దుల్ హమీద్ అడిగిన ప్రశ్నకు సిఎం ఈ విధంగా స్పందించారు. రాష్ట్రంలో రేషన్ వ్యవస్థ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కొత్త పబ్లిసిటీ పద్ధతిని అనుసరిస్తోందని స్పష్టమవుతున్నట్టు ముఖ్యమంత్రి ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో ఇది అమలు చేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామన్నారు.

ఇది ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలా లేదా అనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. దీనిపై కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జీఆర్ అనిల్ మాట్లాడుతూ 14 వేలకు పైగా ప్రధాని పోస్టర్లు బ్యానర్లు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా , రాష్ట్ర ఆహార శాఖకు బాధ్యత అప్పగించిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 550 రేషన్ దుకాణాల్లో పీఎం సెల్ఫి పాయింట్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించిందని , వాటిని తనిఖీ చేయాల్సిందిగా ఎఫ్‌సిఐ అధికారులకు సూచించామన్నారు. ఆహార పదార్ధాల పంపిణీకి కేంద్ర ప్రభుత్వ గుర్తులున్న క్వారీ బ్యాగ్‌లను సరఫరా చేయాలని చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ప్రచారం కోసం రేషన్ పంపిణీ వ్యవస్థను ఉపయోగించుకోవడం సరికాదని మంత్రి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News