ధోనీ, రోహిత్లను వెనక్కి నెట్టేసిన కోహ్లీ
ట్విట్టర్ అభిమానుల్లో టాప్
ముంబయి: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ మహిందర్ సింగ్ ధోనీ, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మలను వెనక్కి నెట్టేశాడు. అయితే ఇది క్రికెట్ ఫీల్డ్లో కాదు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో ఈ ఏడాది అభిమానులు ఎక్కువగా చర్చించుకున్న భారతీయ అథ్లెట్లలో కోహ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు.ఈ క్రమంలో అతను ధోనీ,రోహిత్లను వెనక్కి నెట్టేశాడు. ఇక మహిళా అథ్లెట్ల విషయానికి వస్తే రెజ్లర్ గీతా ఫొగెట్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో బ్యాడ్మింటన్ స్టార్లు పివి సింధు, సైనా నెహ్వాల్లు ఉన్నారు. ఇప్పటికే కోహ్లీ తాను తండ్రి కాబోతున్నట్లు చేసిన ట్వీట్ ఈ ఏడాది ఎక్కువ లైక్లు పొందిన ట్వీట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఎక్కువ రీట్వీట్లు చేసిన అథ్లెట్ల ట్వీట్లలో ప్రధాని మోడీకి కృతజ్ఞతలు చెబుతూ ధోనీ చేసిన ట్వీట్ టాప్లో నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు 15న ధోనీ రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ప్రధాని మోడీ అతన్ని ప్రశంసిస్తూ ఒక లేఖ పంపారు. దానిని ట్విట్టర్లో పోస్టు చేస్తూ మోడీకి ధోనీ కృతజ్ఞతలు తెలిపాడు.ఈ ట్వీట్కు భారీ స్పందన వచ్చినట్లు ట్విట్టర్ తెలిపింది.
Kohli beats MS Dhoni and Rohit to most Tweeted