లండన్ : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయి (23) ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేశారు. ఆక్స్ఫర్డ్కు చెందిన లేడీ మార్గరెట్ హాల్ కాలేజీలో మలాలా తత్వశాస్త్రం, రాజనీతిశాస్త్రం,ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. దీనికి సంబంధించిన రెండు ఫోటోలను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులోని ఒక ఫోటోలో తన కుటుంబసభ్యులతో కేక్ కట్ చేస్తూ కనిపించారు. ఇప్పటికిపుడు తనకు భవిష్యత్ ప్రణాళికలేమీ లేవని ట్విట్ చేశారు. నెట్ఫ్లిక్స్, పుస్తక పఠనం, నిద్ర ఇవే తన కాలక్షేపాంశాలుగా ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతోషం, కృతజ్ఞతా భావాల్ని వ్యక్తం చేయడం కూడా కష్టంగా ఉన్నదన్నారు. పాకిస్థాన్లోని స్వాత్ లోయలో మహిళా విద్య కోసం ప్రచారం చేస్తున్నందుకు మలాలా 2012లో తాలిబన్ల దాడికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స కోసం లండన్ వెళ్లి అక్కడే చదువుకున్నారు. 2014లో 17 ఏండ్ల వయసులోనే నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.