Tuesday, April 30, 2024

ప్రధాన పార్టీల అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. ఈ ఎలక్షన్‌లో స్వతంత్రులుగా పోటీ చేసి వారికి గుర్తుల కేటాయింపు పూర్తయ్యింది. వీటిల్లో కొన్ని ప్రధాన అభ్యర్థులను పోలిన గుర్తులు ఉండడంతో వారంతా గుబులు చెందుతున్నారు. పోలింగ్ సందర్భంగా ఈవిఎంలో దగ్గర దగ్గర పోలికలు ఉండే గుర్తులుంటే ప్రజలు తికమక పడుతుంటారు. ముఖ్యంగా వృద్ధులు తాము వేయాలనుకున్న పార్టీకి బదులు వేరొక పార్టీకి వేసే ప్రమాదమున్న నేపథ్యంలో పలు ప్రధాన పార్టీలు తమ పార్టీ గుర్తుకు దగ్గరగా ఉన్న గుర్తులను కేటాయించవద్దని కోర్టులను సైతం ఆశ్రయించడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కల్వకుర్తి నియోజకవర్గాల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరికి రోడ్డు రోలర్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేస్తున్న అభ్యర్థికి అలాగే షాద్‌నగర్,

చేవెళ్ల నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు రోడ్డు రోలర్ గుర్తును ఇచ్చారు. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, కల్వకుర్తి నియోజకవర్గాల్లో అలయన్స్ ఆఫ్ డెమెక్రాటిక్ రిఫారమ్స్ పార్టీ అభ్యర్థులకు చపాతీ కర్ర, రోడ్డు రోలర్ గుర్తు దక్కింది. ఇక జనసేన గుర్తు గాజు గ్లాసు తెలంగాణలో ఫ్రీ సింబల్ లిస్టులో ఉంది. శేరిలింగంపల్లి, మహేశ్వరం నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తున్న రాజమహేంద్ర కటారి, సుబ్రమణ్య రాహుల్‌కు గాజు గ్లాస్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. కల్వకుర్తిలో ఎ స్యూసీఐ పార్టీ అభ్యర్థి గుర్తు కూడా గాజు గ్లాసే కావడం విశేషం. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా గుర్తు అనేది ప్రధాన ఆయుధం. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అభ్యర్థి పేరు కంటే పార్టీ గుర్తే ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు తలనొప్పిగా మారాయి. ప్రతిసారి ఎన్నికల్లో అభ్యర్థులకు గుర్తుల గుబులు పట్టుకుంటోంది. గుర్తును పోలిన గుర్తులు కేటాయించడంతో ఓటమి చెందిన అభ్యర్థులు ఉన్నారు. అయితే ఈసారి ఎవరికీ ఎలాంటి అనుభవం ఎదురవుతుందో చూడాల్సిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News