Saturday, May 4, 2024

పార దర్శకంగా దళితబంధు అమలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన దళిత బంధు పధకం పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఎస్‌సి అభివృది శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. శుక్రవారం కరీంనగర్ లోని తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్ది దారుల ఎంపికలో అవకతవకలు, అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల ప్రకారమే దళిత బంధు లబ్ది దారుల ఎంపిక జరుగుతోందని చెప్పారు. మొదటి దశలో ఎంఎల్‌ఎల సూచనతో లబ్ది దారుల ఎంపిక ప్రక్రియ చేపట్టడంపై అపోహలు రావడంతో జిల్లా కలెక్టర్లకే ఆ బాధ్యత అప్పగించడం జరిగిందన్నారు. సంబంధిత జిల్లా మంత్రులు జిల్లా కలెక్టర్‌లతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

దళిత బంధు రెండో విడతలో ప్రభుత్వం కేటాయించిన 17 వందల కోట్ల రూపాయల నిధుల్లో ఇప్పటికే 850 కోట్లు వచ్చి ఉన్నాయని మంత్రి చెప్పారు. దశల వారీగా ప్రతి దళిత కుటుంబానికి పథకం వర్తింపజేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. స్వరాష్ట్రంలో దళిత, బడుగు, బలహీనవర్గాల జీవితాల్లో సమూలమైన మార్పుల కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. విద్య, వైద్య పరంగా అట్టడుగు వర్గాల పేదల కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా స్వాతంత్రానంతరం నుంచి కూడా అంటరానితనానికి, వివక్షకు గురైన దళిత కుటుంబాల్లో మార్పులు తేవాలన్న లక్ష్యంతోముఖ్యమంత్రి కెసిఆర్ దళితబంధుకు రూపకల్పన చేశారని చెప్పారు.

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచడమే ఈ పథకం లక్ష్యమన్నారు. ఇప్పటికే ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన దళిత కుటుంబాలు ఆర్థిక వికాసం వైపు అడుగులు వేస్తున్నాయని, ఉపాధి పొందుతూ లబ్ది దారులు నలుగురికి ఉపాధి కల్పిస్తూ ప్రయోజనం పొందుతున్నారని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ఎస్‌సి కార్పొరేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News