Tuesday, April 30, 2024

మాటల మోడీ కావాలా.. చేతల కెసిఆర్ కావాలా?

- Advertisement -
- Advertisement -

8ఏళ్లలో ప్రధాని మోడీ
తెలంగాణకు చేసిందేమీ లేదు

కాంట్రాక్టు కోసం బిజెపికి
అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డి
మిషన్ భగీరథ పథకంతో
ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిన
ఘనత కెసిఆర్‌దే
కూసుకుంట్లను గెలిపిస్తే
మునుగోడు అభివృద్ధి

8 ఏళ్లలో ప్రధాని మోడీ తెలంగాణకు చేసిందేమీ లేదు
కాంట్రాక్టు కోసం బిజెపికి అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి
మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్‌ను తరిమికొట్టిన ఘనత కెసిఆర్‌దే
కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు అభివృద్ధి : మంత్రి కెటిఆర్

మన తెలంగాణ / చౌటుప్పల్ : మాటలు చెప్పే మోడీ కావాలా…. సంక్షేమ పథకాలిచ్చే కెసిఆర్ కావాలా…. మునుగోడు నియోజకవర్గ ప్రజలు తేల్చుకోవల్సిన సమయం ఆసన్న మైందని మంత్రి కెటిఆర్ అన్నారు. చౌటుప్పల్ పురపాలక కేంద్రంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన టిఆర్‌ఎస్ రోడ్ షో కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్‌కు టిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం స్థానిక చిన్నకొండూరు రోడ్డు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. బిజెపి సారధ్యంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. మునుగోడులో గత పర్యాయం ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 3 ఏళ్ల పాటు బేరమాడి చివరకు బేరం కుదిరాక బిజెపిలో చేరాడన్నారు. రూ. 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బిజెపికి అమ్ముడు పోయి చేతులారా ఉప ఎన్నికను తీసుకు వచ్చాడని విమర్శించారు. డబ్బు అహంకారంతో పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ఉప ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఓటర్లకు పిలుపు నిచ్చారు.

కెసిఆర్ సర్కార్ అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్‌తో పుష్కలంగా పంటలు పండు తున్నాయని తెలిపారు. అత్యధికంగా వరి పండిస్తున్నది నల్గొండ జిల్లా రైతులేనన్నారు. గతంలో ఫ్లోరోసిస్ కారణంగా ఈ ప్రాంతానికి పిల్లనివ్వాలంటే ఇతర ప్రాంతాల వారు ముందుకొచ్చే వారు కాదన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి ప్లోరిన్ రహిత త్రాగునీరు అందిస్తూ ఆ సమస్యకు సిఎం కెసిఆర్ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. నాడు పంట పెట్టుబడి కోసం రైతుకు అప్పు పుట్టేది కాదని, ఇప్పుడా సమస్య లేకుండా సిఎం కెసిఆర్ రైతుభంధును అమలు చేస్తూ ప్రతి రైతుకు పంట పెట్టుబడిని అందిస్తున్నారని చెప్పారు. అలాగే రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న సిఎం కెసిఆర్‌కే సొంతమని పేర్కొన్నారు. కేవలం మునుగోడు నియోజకవర్గంలో 43 వేల ఆసరా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు.

అలాగే చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం పరిధిలో 580 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశామన్నారు. మునుగోడు అభివృద్దికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఆయన తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్ది కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ది చేస్తానన్నారు. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి, మతోన్మాద రాజకీయాలతో రాజ్యమేలుతున్న బిజెపిని తరిమి కొట్టాలని మంత్రి పిలుపు నిచ్చారు. అలాగే సిపిఐ, సిపిఎం నాయకులు పల్లా వెంకట్‌రెడ్డి, చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ మతోన్మాద బిజెపిని అడ్డు కోవడమే లక్షంగా మునుగోడులో కారు గుర్తుకు ఓటువేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కూసుకుంట్ల పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News