Friday, April 26, 2024

అధికారులపై ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అధికారులపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు అభివృద్ధి పనుల ఆలస్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. త్వరగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. శనివారం మంత్రి కెటిఆర్ పలు అభివృద్ధి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ విఎస్టీ- నుంచి ఇందిరాపార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికంగా మారబోతుందని ఆయన పేర్కొన్నారు. ముందుగా ఇందిరాపార్క్ వద్ద కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి పనుల వరకు చేరుకున్న మంత్రి కెటిఆర్ స్టీల్ బ్రిడ్జి పనుల పురోగతిని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్టీల్ బ్రిడ్జి పనుల పురోగతిని తెలుసుకున్న అనంతరం ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

స్టీల్ బ్రిడ్జి పనులు మూడునెలల్లో పూర్తి చేయాలి
స్టీల్ బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో మూడు నెలల్లోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లీంపు వంటి అంశాల్లో నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు నెలల్లోగా నిర్మాణం పూర్తి చేయాలని, అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని కెటిఆర్ ఆదేశించారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలను తీసుకోవాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

2.8 కిలోమీటర్లు….రూ.440 కోట్ల ఖర్చు
2.8 కిలోమీటర్ల పొడవైన నాలుగు వరుసల స్టీల్ బ్రిడ్జి కోసం దాదాపు రూ.440 కోట్లను జీహెచ్‌ఎంసి ఖర్చు చేస్తున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆర్టీసి క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి, ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట్ వంటి నియోజక వర్గాల ప్రజల సౌకర్యార్థం ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్న డిమాండ్ రెండు దశాబ్ధాలుగా ఉందని, ఇంతటి కీలకమైన ఈ బ్రిడ్జి నిర్మాణం సత్వరంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతోనే సాధారణ కాంక్రీట్ నిర్మాణం కాకుండా స్టీల్ బ్రిడ్జిని ఈ మార్గంలో నిర్మిస్తున్నట్టు కెటిఆర్ తెలిపారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం రానున్న 3 నెలల్లో పూర్తి అవుతుందన్న విశ్వాసాన్ని మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు. ఇది పూర్తయితే నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలా పనుల పరిశీలన
హుస్సేన్‌సాగర్ సర్‌ప్లస్ నాలాలో చేపడుతున్న పనులను కెటిఆర్ పరిశీలించారు. అశోక్ నగర్ వద్ద కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహన్ని తగ్గించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని కెటిఆర్ తెలిపారు. హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలాకు భారీగా నిధులు కేటాయించామని కెటిఆర్ స్పష్టం చేశారు. వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేయాలని కెటిఆర్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News