Sunday, April 28, 2024

పేదలను దంచు.. పెద్దలకు పంచు

- Advertisement -
- Advertisement -

ఇదే మోడీ
సర్కార్ విధానం

వ్యవసాయం, విద్యుత్‌ను
ప్రైవేటుపరం చేసే కుట్ర
విద్యుత్ సంస్కరణలు
అమల్లోకి వస్తే నష్టపోయేది
తెలంగాణే : కెటిఆర్

మన తెలంగాణ/తంగళ్లపల్లి/హైదరాబాద్: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవసాయాన్ని, కరెంట్‌ను కార్పొరేట్ పరం చేసేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తోందని టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అన్ని రంగాలను ప్రైవేటు పరం చేస్తున్న కేంద్రం.. ధాన్యం సేకరణను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఉచితాలు రద్దు చేయాలంటూ మాట్లాడుతున్న ప్రధానమంత్రి తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం లక్షల కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. దేశానికి అన్నం పెడుతు న్న రైతన్నలకు ప్రొత్సాహకాలు ఇవ్వడానికి మనస్సురాని మోడీ ప్రభుత్వం, బడాబాబుల కు దేశ సంపదను అప్పనంగా దోచిపెడుతోందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి కోసం దేశాన్ని సర్వనాశనం చేస్తోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. మోడీ పాలన చూస్తుం టే కాకులను కొట్టి గద్దలకు వేసినట్టు పేదలను కొట్టి పెద్దలకు వేసే ప్రయత్నం జరుగుతున్న ట్లు కనిపిస్తోందన్నారు. గురువారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, మరోసారి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన ఎనిమిదేళ్లు అవుతున్నా…ఇప్పటి వరకు ఏ వర్గానికి మేలు జరిగే విధంగా ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోయారని విమర్శించారు. ఆయన ధ్యాసంతా కార్పొరేట్ మిత్రుల సంక్షేమంపైనేనని కెటిఆర్ మండిపడ్డారు. మోడీ తీసుకునే నిర్ణయాలు కూడా బడాబాబులకే అనుకూలంగా ఉంటున్నాయన్నారు. రైతుల సంక్షేమం అంటే పట్టదు…పైగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా గతంలో నల్లచట్టాలను తీసుకొచ్చిన మహాఘనడు మోడీ అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రం తీసుకొచ్చిన ఆ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తే…దిగొచ్చిన మోడీ సర్కార్ మరోసారి దొంగచాటు ప్రయత్నాలను ఒడిగడుతోందని కెటిఆర్ ఆరోపించారు. ఇందులో భాగంగా వచ్చే సీజన్ ధాన్యం సేకరణ పూర్తిగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే యత్నాలకు కేంద్రం పూనుకుంటోందని విమర్శించారు. ఈ చర్యలను అరికట్టేందుకు బిజెపియేతర పార్టీలన్నీ ఏకమై మోడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

విద్యుత్ చట్టాలను బలవంతంగా దేశ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. ఈ చట్టాలను తెలంగాణతో సహ అనేక రాష్ట్రాలు వ్యతిరేకిసున్నాయన్నారు. అయినప్పటికీ కేంద్రం రాష్ట్రాల మెడపై కత్తిపెట్టి విద్యుత్ చట్టాలను అమలు చేయాలని వత్తిడి తీసుకొస్తోందన్నారు. మోడీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఇతర రాష్ట్రాలు లొంగినా….తెలంగాణ రాష్ట్రం మాత్రం లొంగదని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కల్వకంట్ల చంద్రశేఖర్‌రావు అన్న విషయాన్ని కేంద్రం గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రం ఉడతా బెదిరింపులకు భయపడే వ్యక్తి కెసిఆర్ కాదన్నారు. అందుకే బల్లగుద్ది చెబుతున్నామని…కేంద్రం తీసుకొచ్చే విద్యుత్ చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయమన్నారు. రైతులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ఎంతదూరమైన పోతామని…ఎవరితోనైనా రాజకీయ యుద్ధం చేస్తామన్నారు.

ధాన్యం సేకరణ…ఇక ప్రైవేటు పరం?

అన్ని రంగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు విక్రయిస్తున్న కేంద్రం…చివరికి ధాన్య సేకరణ అంశాన్ని కూడా ప్రైవేటుపరం చేసేందుకు యత్నిస్తోందని కెటిఆర్ ఆరోపించారు. వచ్చే సీజన్ నుంచి ధాన్యం సేకరణలో ప్రైవేట్ కంపెనీల ఎంట్రీ ఉండే అవకాశముందన్నారు.

తెలంగాణ వడ్లు కొనుమంటే భారీగా నిలువలు ఉన్నాయన్న కేంద్రం ప్రస్తుతం ఆహార ధాన్యాల కొరత ఉందని చెబుతోందన్నారు. మొన్నటికి మొన్న నాలుగేళ్ల వరకు నిల్వలు ఉన్నాయని బొంకిన, సిగ్గులేని కేంద్రం ఈ రోజు ఎగుమతులను రద్దు చేసిందని ఆయన మండిపడ్డారు. పైగా రైతులకు రాష్ట్రాలు ఇస్తున్న ప్రోత్సాహాకాలను ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. అ కేటీఆర్ పేర్కొన్నారు. పంటలు సేకరించే పని నుంచి కేంద్రం తప్పించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రత చట్టం ప్రకారం ప్రతి గింజను కొనాల్సిన బాధ్యత కేంద్రానిది అయితే దాని నుంచి కూడా తప్పించుకుంటుందన్నారు.

రైతులను కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర

కేంద్రం రైతులపై కత్తి కట్టిందని మంత్రి కెటిఆర్ ఆరోపించారు. వారిని రైతు కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర పన్నిందని విమర్శించారు. రైతు బిడ్డ కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో పంటలు భారీ ఎత్తున సాగవుతున్నాయన్నారు. లక్ష35 వేల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయని పేర్కొన్నారు. 2015 నుంచి ఈ రోజుకి సుమారు 50లక్షల అదనపు ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. రైతుబంధు, రైతు బీమా సాగునీటి రంగాన్ని బలోపేతం చేయడం వంటి కార్యక్రమాలతోనే ఇది సాధ్యమైందన్నారు. కానీ కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అవహేళనగా మాట్లాడరని విమర్శించారు. తెలంగాణలో వ్యవసాయం పండగ మారుతుంటే మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు బాధను కలిగిస్తున్నాయన్నారు.

కేంద్రం అసమర్థ నిర్ణయాలు

కేంద్రం అనాలోచిత, అసమర్ధ నిర్ణయాలతో దేశంలో వ్యవసాయంతో పాటు విద్యుత్ రంగం దివాలా తీయించే ప్రయత్నం చేస్తోందని కెటిఆర్ ధ్వజమెత్తారు. నరేంద్ర మోదీ పాలనలో నైజీరియా కన్నా ఎక్కువ మంది పేదలు భారతదేశంలో ఉన్నారన్నారు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ కన్నా దారుణంగా హంగర్ ఇండెక్స్‌లో భారత్ కొనసాగుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతోనే వ్యవసాయం సంక్షోభంలో పడుతున్నది, కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తమ సొంత పొలాల్లోనే కూలీలుగా మారే పరిస్థితి వచ్చింది ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రంతో పాటు దేశంలోని రైతన్నలంతా గుర్తించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన వ్యవసాయ చట్టాలను అంగీకరించమని ముఖ్యమంత్రి రైతాంగం పక్షాన నిలబడ్డారన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే రూ. 25వేల కోట్ల వరకు రుణాలు ఇస్తామని కేంద్రం చెప్పినా…. సిఎం కెసిఆర్ మాత్రం రైతుల పక్షానే నిలబడ్డారన్నారు.

విద్యుత్ పంపిణీని ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ఆరాటం

ప్రజలతో ఎలాంటి చర్చలేకుండా… పార్లమెంటుతో సంబంధం లేకుండా విద్యుత్ సంస్కరణల పేరుతో విద్యుత్ పంపిణీని ప్రైవేట్‌పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. తన కార్పొరేట్ మిత్రులకు అప్పచెప్పడానికే నరేంద్ర మోదీ ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే రూ.3వేలకు వచ్చే సింగరేణి బొగ్గును కాదని రూ.35వేలకు ఆస్ట్రేలియన్ బొగ్గును కొంటున్నారని ఆరోపించారు. ఇది తన కార్పొరేట్ మిత్రులు చేస్తున్న బొగ్గు వ్యాపారం కోసమేనన్నారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థలను దివాళా తీయించడం కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. తన కార్పొరేట్ మిత్రుడిని ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలోకి తీసుకుపోవడం కోసం దేశంలోని వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని పణంగా పెట్టి దివాళా తీయించే లక్ష్యంతో ప్రధానమంత్రి మోదీ పని చేయిస్తున్నారని మండిపడ్డారు. అందుకే ఆయన కోసం శ్రీలంక వంటి దేశాల్లో కార్పొరేట్ మిత్రుని తరఫున పైరవీ చేశారన్నారు.

దొడ్డి దారిన గెజిట్లు విడుదల చేయడం ఎందుకు?

కేంద్రం తీసుకువచ్చే నూతన విద్యుత్ బిల్లులను అడ్డుకుంటామని శాసనసభ సాక్షిగా సిఎం కెసిఆర్ చెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు. అందుకే . రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రుణాలు రాకుండా చేసి వాటిని దివాళా తీయించే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం దొడ్డి దారిన గెజిట్లను విడుదల చేస్తున్నదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నం చేయడంలో ఇదంతా ఒక భాగం అని కెటిఆర్ అన్నారు.

ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్ర రైతన్నల ఉచిత కరెంటుతోపాటు దళిత గిరిజన రజక నాయి బ్రాహ్మణ వంటి వృత్తుల వారికి కొన్ని పరిశ్రమలకు ఇచ్చే సబ్సిడీ విద్యుత్ కూడా పోతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలు అమలులోకి వస్తే అత్యధికంగా నష్టపోయేది తెలంగాణ రాష్ట్రమేనన్నారు. రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు భారీగా నష్టపోతారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నతో పాటు సిరిసిల్లలోని నేతన్నలు సబ్సిడీ లేకుండా చావుదెబ్బ తింటారని సంక్షోభంలోకి పోతారన్నారు. ప్రీపెయిడ్ మీటర్లతో ముందు డబ్బులు కడితేనే విద్యుత్తు లభిస్తుందన్నారు. ప్రైవేటు కంపెనీలు విద్యుత్ పంపిణీ రంగంలోకి దిగితే పెట్రోల్ రేట్ల మాదిరి రోజురోజుకి విద్యుత్ రేట్లు మారుతాయన్నారు. విద్యుత్ రేట్లు అడ్డగోలుగా భారీగా పెరుగుతాయన్నారు. కేంద్రం మెడలువచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరముందన్నారు. దీనికి టిఆర్‌ఎస్ పార్టీ తన వంతు ప్రయత్నాలు చేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News