Wednesday, May 1, 2024

‘మహిళ’ మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

మహిళలు మానసికంగా చాలా బలంగా ఉం టారని, అది తాము నేర్చుకోవాలని బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.టి.రామారావు వ్యాఖ్యానించారు. తన చిన్నతనం ఉమ్మ డి కుటుంబంలోనే, ఉమ్మడి కుటుంబాలలో మహిళలది ప్రధాన పాత్రని పేర్కొన్నారు. తమ తండ్రి కెసిఆర్ ప్రజా జీవితంలో బిజీగా ఉండటం వల్ల చిన్నతనంలో ఆయన ప్రభావం తనపై తక్కువగా ఉండేదని, తమ తల్లిని చూ స్తూ చాలా నేర్చుకున్నామని అన్నారు. నగరంలోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఉమెన్ ఆస్క్ కెటిఆర్ పేరుతో ఆదివారం మహిళలతో నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశంలో మహిళలు అడిగిన పలు ప్రశ్నలకు కెటిఆర్ స మాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కు టుంబం గురించి కెటిఆర్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తమది పెద్ద ఉమ్మడి కుటుంబం అని, చిన్నప్పటి నుంచి తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నామని చెప్పారు. తన సతీమణి చాలా ఓపికగా ఉంటారని చెప్పారు. తన చెల్లి చాలా డైనమిక్ అని.. కుటుంబంలో ఆమె అంత ధైర్యవంతులు లేరని పేర్కొన్నారు. తన కుమార్తె చిన్నవయసులోనే చాలా బాగా సృజనాత్మకంగా ఆలోచిస్తోందని అన్నారు. పిల్లలిద్దరినీ సమానంగా చూస్తానని చెప్పారు. తనకు కూతురు పుట్టాక తన జీవితం చాలా మారిందని కెటిఆర్ తెలిపారు.
లేనివి కూడా అమలు చేశాం
ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కెటిఆర్ అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే  రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని చెప్పారు. మహిళ అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొన్నారు. సృష్టించేందుదకే తెలంగాణలో మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని, తద్వారా మహిళలు చిన్న తరహా పరిశ్రమలు ప్రారంభించారని చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ పథకాలు తమ మేనిఫెస్టోలో లేవని, అయినా వాటిని కూడా చేశామని తెలిపారు. అమ్మఒడి ద్వారా శిశు మరణాలు, ప్రసూతి మరణాలు తగ్గాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల శాతం పెరిగిందని అన్నారు. మైనార్టీల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేశామని.. ప్రతి చిన్నారిపై రూ.10,000కు పైగా ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. అదే విధంగా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం.. ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. బిఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

నేను రష్మిక అంత ఫేమస్ కాదు
తాను హీరోయిన్ రష్మిక అంత ఫేమస్ కాదు అని కెటిఆర్ సరదాగా వ్యాఖ్యానించారు. డీప్ ఫేక్, సోషల్ మీడియాపై కెటిఆర్ స్పందిస్తూ, మహిళలు మాత్రమే డీప్ ఫేక్ బారిన పడలేదని.. ప్రత్యర్థులు తమపై సైతం దీనిని వినియోగించి దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఒక్కోసారి సోషల్ మీడియా విష ప్రచారాలకు వేదిక అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలకు అరికట్టడానికి నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంతో కలిసి సైబర్ నేరాలపై ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. డీప్ ఫేక్ మహిళలకు మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని అన్నారు. ఈ ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని.. దీనిపై బాధగా ఉందన్నారు. అయితే జిల్లా స్థాయిలో ఎంతో మంది మహిళా నేతలకు ఎన్నో అవకాశాలు కల్పించామని అన్నారు. అయితే ఎంఎల్‌ఎ టికెట్‌ల కేటాయింపులోనూ భవిష్యత్‌లో మహిళలకు మెరుగ్గా టిక్కెట్లు కేటాయిస్తామని చెప్పారు.

ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశాను
తన జీవితంలో ఎంతోమంది స్ట్రాంగ్ ఉమెన్ లీడర్లను చూశానని కెటిఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే అని వివరించారు. సానియా మీర్జా, సైనా నెహ్వాల్, నిఖత్ జరీన్ వంటి ఎంతో మంది మహిళలు హైదరాబాద్ నుంచి క్రీడల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో సుచిత్ర ఎల్లా, మహిమా దాట్ల వంటి వారు గొప్పగా నిలిచారని చెప్పారు. శ్రీనిధి వంటి కార్యక్రమాలు మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో సుల్తాన్‌పూర్, నందిగామ సహా మొత్తం నాలుగుచోట్ల ప్రత్యేకంగా మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశామని అన్నారు.
మేమే గెలుస్తామని తెలుసు.. వాళ్లు నటిస్తున్నారు
ఈ ఎన్నికల్లో తామే గెలుస్తామని, అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు కూడా తామే గెలుస్తామని తెలుసు అని, కానీ వాళ్లు నటిస్తున్నారని వ్యాఖ్యానించారు.
మహిళల హక్కులు తెలుసుకునేందుకు వన్‌స్టాప్ సెంటర్ ఉండాలి
హైదరాబాద్‌ను మహిళలు సురక్షితంగా భావిస్తున్నారని కెటిఆర్ వివరించారు. మహిళల హక్కులు తెలుసుకునేందుకు వన్‌స్టాప్ సెంటర్ ఉండాలని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. మహిళల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మహిళలు మెట్రోరైలు దిగి ఇంటికి వెళ్లే మార్గంలో కొంతమంది పోకిరీలు ఉంటున్నారని, మహిళలు మెట్రో స్టేషన్ నుంచి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించాలనే ఆలోచన ఉందని తెలిపారు. డిసెంబర్ 3 తర్వాత తనకు కూడా కొంత విరామం అవసరమని, డిసెంబర్ 15 లోపు మహిళలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించి, దానిని అమలు చేసేందుకు కృషి చేస్తామని కెటిఆర్ హామీ ఇచ్చారు.
ఐటీ కంపెనీలు ఉప్పల్ వైపు తీసుకొద్దాం.. మహిళ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం..
గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు ఇంటికి ఆలస్యంగా వస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్‌ను ఓ మహిళ ప్రశ్న అడిగారు. ఉప్పల్ వైపు ఆ కంపెనీలు వస్తే తమ పిల్లలు త్వరగా ఇంటికి చేరుకుంటారని అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన కెటిఆర్.. రజనీకాంత్ కూడా గచ్చిబౌలి నచ్చుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. ఉప్పల్ వైపు ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి ఉద్యోగులు త్వరగా ఇంటికి వచ్చేలా చేద్దామని కెటిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News