హైదరాబాద్: స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా నగరంలో నిర్మాణ వ్యర్థాలు, శిధిలాలను రీ సైక్లింగ్ చేసేందుకు జీడిమెట్లలో నిర్మించిన సి అండ్డి వేస్ట్ ప్లాంట్ను పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి చామకూర మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, పార్లమెంట్ సభ్యులు ఎ. రేవంత్రెడ్డి, ఎమ్మెల్సీలు సుంకరీ రాజు, పి.మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కె.వి.వివేకానంద రెడ్డి, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్లు పాల్గొననున్నారు. భవన నిర్మాణ వ్యర్ధాలను, శిధిలాలను రీ సైక్లింగ్ చేయడం ద్వారా వాటి నుంచి 90 శాతంవరకు పునర్ వినియోగానికి ఉపయోగపడే విధంగా వివిధ రకాల మెటీరియల్స్ను ఉత్పత్తి చేయడమే లక్షంగా జీడిమెట్లలో సి అండ్ డి వేస్ట్ ప్లాంట్ను నెలకొల్పారు.
ఈ ప్లాంట్కు టిఎస్ఐఐఐసి ద్వారా ప్రభుత్వం 17 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, రూ. 15 కోట్ల పెట్టుబడి వ్యయంతో పిపిపి -బిఓటి పద్ధతిలో రాంకీ ఎన్విరో సంస్థ 2018 జనవరి 22న నిర్మాణం చేపట్టింది. ప్రతి రోజు 500 టన్నుల సామర్థం గల కాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందస్తూ అనుమతుల్లో 750 టన్నుల సామర్థంతో ఈ ప్లాంట్ను నిర్మించారు. భవన నిర్మాణాల రీ ప్రాసెసింగ్ ద్వారా వెలువడుతున్న సిమెంట్, ఇసుక, పైన్ ఇసుక, దొడ్డు కంకర, చిన్న కంకర తదితరులు ఉత్పత్తులను పునర్వియోగిస్తూ టైల్స్ రోడ్ల నిర్మాణాలతో పాటు ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. ఉత్పతులకు నాణ్యతకు సైతం ఎలాంటి ఢోకా లేకపోవడమే కాకుండా మార్కెట్ ధరలకంటే 25 శాతం తక్కువ ధరకే అందుబాటులో ఉంచారు.