దేశంలో సైబర్ సెక్యూరిటీకి రాజధానిగా హైదరాబాద్ ఎదుగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో శుక్రవారం జోహో కార్పొరేషన్కు చెందిన మ్యానేజ్ ఇంజిన్ నిర్వహించిన షీల్ ఎన్ఎక్స్ జీ 2025 – సీఐఓ కనెక్ట్ సిరీస్ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ దేశంలోనే మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ బ్యూరోను హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. నెలకు 1,200 కుపైగా కేసులు పరిష్కరిస్తోంది. అత్యధిక శిక్ష విధింపు రేటు నమోదు చేసిన ఈ బ్యూరోను జిల్లాల స్థాయికి విస్తరిస్తున్నామని, స్టార్టప్లకు, గ్రామీణ ప్రాంత యువతకు సైబర్ మద్దతు అందించేందుకు చర్యలు చేపట్టాయని అన్నారు. జోహో సంస్థ తీసుకుంటున్న గ్రామీణ అభివృద్ధి మార్గాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రశంసించారు.
పట్టణ-గ్రామీణ మధ్య సాంకేతిక అంతరాన్ని తగ్గించాలన్న దిశగా ఇది చక్కటి ఉదాహరణ అన్నారు. డిజిటల్ పరిణామాల దృష్ట్యా డిజిటల్ ఇండియా యాక్ట్, డిపిడిపి యాక్ట్ అమలు కీలకమని పేర్కొన్నారు. ఎథికల్ హ్యాకింగ్ ఫెలోషిప్, సైబర్ హైజీన్ విద్య, ఏఐ ఆధారిత శిక్షణలు వంటి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుందని మంత్రి తెలిపారు. నమ్మకం, బాధ్యత, భాగస్వామ్యం -ఇవే భవిష్యత్ సైబర్ సెక్యూరిటీకి పునాది కావాలని మంత్రి పేర్కొన్నారు. సైబర్ ముప్పులు, భద్రతలపై దేశవ్యాప్తంగా ఉన్న సీఐఎస్ఓలు, నిపుణులు, విధాన నిర్ణేతలు ఈ వేదికలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది, సైబర్ నిపుణుడు డా. పావన్ దుగ్గల్, ఎన్ఐసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ యోగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏఐ ఆధారిత ముప్పు గుర్తింపు, జీరో ట్రస్ట్ ఆర్కిటెక్చర్, సప్లై చైన్ భద్రత వంటి అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు.