Saturday, May 4, 2024

అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు:ఎంఎల్‌ఎ సైదిరెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎపి మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజుగా మారారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సైదిరెడ్డి ఎద్దేవా చేశారు. అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఎపిలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయని ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎ సైదిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మంత్రి హరీష్ రావుపై ఎపి మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడి అని పేర్కొన్నారు.

దేశంలో అందరు మంత్రులకు హరీష్ రావు ఆదర్శమని వ్యాఖ్యానించారు. ఎపిలో ఎవరిని అడిగినా హరీశ్ రావు గురించి చెబుతారని అన్నారు. హరీశ్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుందని తెలిపారు. విషయం లేకనే ఎపి మంత్రులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలని చెప్పారు. తీరు మార్చుకోకపోతే ఎపి ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారని విమర్శించారు.

Also Read: నిమ్స్‌లో 12 ఏళ్ల బాలుడికి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స

అభివృద్ధిపై చర్చకు సిద్ధం
అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో తాము చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. తమ ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని సైదిరెడ్డి హెచ్చరించారు. దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ,ఎపిల అభివృద్ధిపై తనతో ఎపి మంత్రులు చర్చకు రావాలని సవాల్ విసిరారు. హరీశ్‌రావును మొత్తం ఎపి ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదని అన్నారు.అక్కడ పాలక, ప్రతిపక్షాలు ఒకే తీరుగా ఉన్నాయని విమర్శించారు. హరీశ్‌రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని చెప్పారు. సిఎం కెసిఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపిందని వెల్లడించారు.

800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదని పేర్కొన్నారు. తమతో అభివృద్ధి లో పోటీ పడాలని సూచించారు. సిఎం కెసిఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరని, ఎపి మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ని ఎపి అనుసరించాలని సూచించారు. రెండు రాష్ట్రాలు బాగుండాలని, అలాగే దేశం కూడా బాగుండాలనేదే తమ తపన అని ఎంఎల్‌ఎ సైదిరెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News