న్యూఢిల్లీ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అంచనాకన్నా రెండు వారాల ముందే యావత్ దేశాన్ని తాకాయని భారత వాతావరణశాఖ తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు 45 రోజుల తర్వాత రాజస్థాన్లోని శ్రీగంగానగర్కు చేరుకుంటాయి. దేశంలో అదే చివరి అంచు. కానీ, ఈసారి ఈ తేదీని ఐఎండి ఓ వారం ముందుకు జరిపింది. అది జులై 8. కానీ, అంతకన్నా ముందే జూన్ 26న దేశం యావత్తునూ రుతుపవనాలు తాకాయని ఐఎండి తెలిపింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్ల్లోని మిగతా ప్రాంతాలకు కూడా శుక్రవారమే రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్ప పీడనం, మధ్య భారత్లో తుపాన్ వల్ల ఈసారి రుతుపవనాలు త్వరితమయ్యాయని ఐఎండి తెలిపింది. రుతుపవనాలు ముందే దేశం యావత్తుకూ విస్తరించడం 2013 తర్వాత ఇదే మొదటిసారని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. 2013లో జూన్ 16 వరకల్లా రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. ఆ ఏడాదే ఉత్తరాఖండ్లో భారీ వరదలు సంభవించాయి.