జన్యులోపం వల్లేనని తేల్చిన డాక్టర్లు
కోల్కతా : 30 ఏళ్ల తర్వాత ఓ మహిళలో పురుష లక్షణాలను డాక్టర్లు గుర్తించారు. బెంగాల్లోని బీర్భూమ్కు చెందిన ఈ వ్యక్తిని డాక్టర్లు గుర్తించే వరకూ అంతా సాధారణ మహిళగానే అనుకున్నారు. జన్యుపరమైన ఈ లోపం ప్రతి 22,000 మందిలో ఒకరికి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. ఇదే లోపాన్ని ఆమె 28 ఏండ్ల సోదరిలోనూ గుర్తించారు. దీనిని ఆండ్రోజెన్ ఇంటెన్సిటివిటీ సిండ్రోమ్గా చెబుతారు. వీరు జన్యుపరంగా మగవారు. కానీ, బహిర్గత లక్షణాలైన వక్షోజాలు, లైంగికావయాలులాంటివి ఆడవారిలాగే ఉంటాయి. దాంతో, ఇలాంటివారిని మహిళలుగానే భావిస్తారు.
30 ఏళ్ల ఈ మహిళ తొమ్మిదేళ్ల క్రితం ఓ వ్యక్తిని పెళ్లి కూడా చేసుకున్నారు. రెండు నెలల క్రితం పొత్తి కడుపులో తీవ్ర నొప్పి రావడంతో కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్యాన్సర్ ఆస్పత్రిలో చేరారు. పలు వైద్య పరీక్షల తర్వాత ఆమెలోని ద్వంద్వ లక్షణాల్ని వారు గుర్తించారు. చూడటానికి మహిళగానే కనిపిస్తుంది. ఆమె గొంతు కూడా ఆడవారిలాగే ఉంటుందని డాక్టర్లు తెలిపారు. గర్భాశయం, అండాశయం లేకపోవడాన్ని డాక్టర్లు గుర్తించారు. శరీరం లోపల వృషణాలను గుర్తించారు. ఇప్పటివరకు ఆమెకు నెలసరి రాకపోవడంతో ఆమె అసలు సమస్య అర్థమైంది. ప్రస్తుతం ఆమె వృషణసంబంధ క్యాన్సర్(సెమినోమా)తో బాధ పడుతున్నారు. కెమోథెరఫీ చికిత్స అందిస్తుండటంతో ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నదని డాక్టర్లు తెలిపారు.