తిరువనంతపురం: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తనయుడి కోసం ఓ తల్లి 2700 కిలో మీటర్లు ప్రయాణించిన సంఘటన కేరళలోని కొట్టాయమ్ జిల్లాలో జరిగింది. శీలమ్మ వాసన్ కు అరుణ్ కుమార్ అనే తనయుడు ఉన్నాడు. అరుణ్ భారత ఆర్మీలో పని చేస్తున్నాడు. రాజస్థాన్లో జోధపూర్లో ఉన్న అరుణ్ అనారోగ్యం పాలుకావడంతో ఐసియులో చికిత్స పొందుతున్నాడు. తన తల్లి, భార్యను చూడాలని ఎయిమ్స్ వైద్యులకు తెలపడంతో వాళ్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించడంలో ఎలా వెళ్లాలో తెలియలేదు. కాంగ్రెస్ లీడర్ ఉమెన్ చాందీ సహాయంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్, కేంద్ర మంత్రి మురళీధరన్ సహాయంలో పాస్ తీసుకున్నారు. శీలమ్మ తన తోడుగా కోడలిని, ఒక బంధువును కారులో తీసుకెళ్లింది. ఏప్రిల్ 11న కోట్టాయమ్ నుంచి వాళ్ల ప్రయాణం ప్రారంభంకాగా ఏప్రిల్ 14న జోధ్పూర్కు చేరుకున్నారు. వెంటనే తన ఆస్పత్రిలో ఉన్న కుమారుడిని కలుసుకున్నారు. నిజామాబాద్ చెందిన ఓ తల్లి 1400 కిలో మీటర్లు స్కూటర్పై ప్రయాణించి తన కుమారుడిని ఇంటికి తీసుకొచ్చిన సంఘటన తెలిసిందే.