Tuesday, April 30, 2024

నల్లగొండ నవాబ్ ఎవరు?

- Advertisement -
- Advertisement -

పాగా వేసేందుకు ప్రధాన పార్టీల ఫోకస్

సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు పట్టుదలతో అధికార పార్టీ
సత్తా చాటేందుకు గులాబీ, కమలం పార్టీల ఎత్తుకు పైఎత్తులు
అంతర్గత సమావేశాలతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న అభ్యర్థులు

తండు నాగార్జున సాగర్ గౌడ్ / నల్గొండ జిల్లా ప్రతినిధి : నల్లగొండ పార్లమెంటుపై ప్రధాన రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. ఆయా ప్రధాన పార్టీలు ముమ్మర కసరత్తు అనంతరం అభ్యర్థులను ప్రకటించాయి. సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ గట్టి పట్టుదలతో ఉంది. ఎలాగైనా సత్తా చాటాలని కమలం, గులాబీ పార్టీలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. నియోజకవర్గాల వారీగా ఆయా పార్టీల అంతర్గత సమావేశాలతో అభ్యర్థులు తమ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. నల్గొండలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. గెలుపు కోసం అధికార, విపక్షాలు వ్యూహరచనల్లో మునిగి తేలుతున్నాయి.

1952లో నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ ఏర్పాటు తర్వాత మొదట్లో కమ్యూనిస్టులు గెలవగా ఆ తరువాత ఓసారి టిడిపి, అనంతరం కాంగ్రెస్ అభ్యర్థుల హవా కొనసాగింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 వేల 682 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు సెగ్మెంట్‌లకు గాను బిఆర్‌ఎస్ నుండి ఆరుగురు ఎంఎల్‌ఎలు గెలవగా, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ ఒక్కరే గెలిచారు. అయినప్పటికీ ఎంఎల్‌ఎగా గెలిచిన ఉత్తమ్ నల్గొండ ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. నల్గొండ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెంగ్మెంట్‌లకుగాను ఆరు సెగ్మెంట్‌లలో ఎంఎల్‌ఎ గెలవగా, ఒక్క సెంగ్మెంట్‌లో మాత్రమే బిఆర్‌ఎస్ విజయం సాధించింది.

గతంలో మాదిరిగానే ఎంపి ఎన్నికల్లో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత కలసి వస్తుందని గులాబీ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమ సిట్టింగ్ పార్లమెంటు స్థానాన్ని నిలబెట్టుకునేందుకు హస్తం పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో తండ్రి జానారెడ్డి, రఘువీర్ రెడ్డి సోదరుడైన నాగార్జునసాగర్ కాంగ్రెస్ నాయకుడు కుందూరు జయవీర్ రెడ్డి సైతం ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పార్లమెంటు పరిధిలోని సీనియర్లయిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మిగతా ఎంఎల్‌ఎలంతా కలసి తన కుమారుడు రఘువీర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని జానారెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా నియోజకవర్గాల పరిధిలో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ లక్షంగా పని చేయాలని సీనియర్ నాయకుడు జానారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదిలా వుంటే మరో జా తీయ పార్టీ బిజెపి సైతం సంప్రదాయానికి భిన్నంగా హుజూర్‌నగర్ బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ శానంపూడి సైదిరెడ్డికి పార్టీ కండువా కప్పి నల్గొండ ఎంపి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ అనూహ్య ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశా రు. సైదిరెడ్డి అభ్యర్థిత్వంపై ఆ శ్రేణుల్లో అసంతృప్తి జ్వా లలు సైతం ఎగిసిపడ్డాయి. సైదిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కాంగ్రెస్ సీనియర్ నేత, పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపిగా ఎన్నియ్యారు. దీంతో ఆయన తన హుజూర్‌నగర్ ఎంఎల్‌ఎ సీటుకు రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో అదే పార్టీ నుంచి ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డిని బరిలో నిలిపారు. అయితే గులాబీ అభ్యర్థ్ధి శానంపూడి సైదిరెడ్డి దాదాపు 44 వేల మెజార్టీతో పద్మావతి రెడ్డిపై గెలుపొంది రికార్డు సృష్టించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ అభ్యర్థిగా ఓటమి చెందిన శానంపూడి సైదిరెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించిన మరుచటిరోజే ఆయనకు నల్గొండ ఎంపి టికెట్ ప్రకటించారు. అయితే పార్టీ పెద్దల జోక్యంతో సైదిరెడ్డి పార్టీలోని అందరు నేతలను కలుపుకొని వెళ్ళడమే కాకుండా నల్గొండ మేనిఫెస్టోను రూపొందించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి కీలకమైన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్యమైన నాయకులందరూ ముఖం చాటేస్తున్నారు. కాగా, మాజీ ఎంఎల్‌ఎ కంచర్ల భూపాల్ రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డి ఎన్నికల బరిలో దిగేందుకు ముందుకు వచ్చారు. అంతకుముందు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా సొంత పార్టీ నేతలే తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆయన వెనక్కి తగ్గారు. తరువాత మాజీ ఎంఎల్‌సి తేరా చిన్నపరెడ్డి పేరు వినిపించినా లిక్కర్ కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అరెస్టు సహా ఇతర రాజకీయ పరిణామాలతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు.

అయితే ప్రస్తుతం తేరా చిన్నపరెడ్డి బిజెపి వైపు చూస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కంచర్ల కృష్ణారెడ్డిని నల్గొండ ఎంపి అభ్యర్థ్ధిగా గులాబీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. 2022లో మునుగోడు ఉప ఎన్నికలో, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు టికెట్ కోసం కంచర్ల కృష్ణా రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. అప్పటి రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఆయనకు టికెట్ దక్కలేదు. మొత్తానికి నల్గొండ పార్లమెంటు అభ్యర్థ్ధిగా కంచర్ల కృష్ణారెడ్డిని ప్ర కటించడంతో ఇకపై ముఖ్య కార్యకర్తల సమావేశాలు సహా నియోజకవర్గాల వారీగా సభలు, సమావేశాలతో ముందుకెళ్ళాలని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. రాష్ట్రంలో కీలకమైన ఈ స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారో వేచిచూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News