Saturday, May 4, 2024

చిన్నారిపై లైంగిక దాడి కేసు.. డ్రైవర్‌కు 20ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

డిఎవి స్కూల్ చిన్నారిపై లైంగిక దాడి కేసులో
డ్రైవర్ రజనీకుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
ప్రిన్సిపాల్ మాధవిని నిర్దోషిగా తేల్చిన కోర్టు
నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ డిఎవి పాఠశాలలో చిన్నారిపై లైంగికదాడి కేసులో దోషి రజనీకుమార్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. గతేడాది అక్టోబర్ 17న డిఎవి స్కూల్‌లో నాలుగేళ్ల చిన్నారిపై డ్రైవర్ రజనీకుమార్ లైంగిక దాడులకు పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల బాలికపై రజనీకుమార్ పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేసింది. పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు ఈ విషయంపై ప్రశ్నించగా.. ప్రిన్సిపాల్ మాధవి.. తన డ్రైవర్‌ను కాపాడేందుకు అనేక మార్లు ప్రయత్నించింది.

Also Read: ధరణి తెచ్చింది.. ప్రభుత్వభూముల ఆక్రమణకేనా?: రఘునందన్

ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 17న బంజారాహిల్స్ డిఎవి స్కూల్ ప్రిన్సిపాల్, డ్రైవర్‌పై చిన్నారి తల్లిదండ్రులు కేసు నమోదు చేశారు. దీంతో అక్టోబర్ 19న రజనీకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి సంబంధించి సాక్ష్యాధారాలను బంజారాహిల్స్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మంగళవారం నాంపల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు తీర్పు వెలువడింది. డ్రైవర్ రజనీకుమార్‌కు దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రిన్సిపాల్ మాధవిని మాత్రం నాపంల్లి కోర్టు నిర్దోషిగా తేల్చింది.

అసలేం జరిగిందంటే…?
బంజారాహిల్స్‌లోని డిఎవి పాఠశాలలో ఓ నాలుగేళ్ల చిన్నారి ఎల్‌కెజి చదువుతోంది. ఎప్పుడూ హుషారుగా ఉండే ఆ చిన్నారి.. కొన్ని రోజులుగా నీరసంగా ఉంటుండటంతో తల్లి ఆరా తీసింది. పాఠశాల ప్రిన్సిపల్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న వ్యక్తి తన గారాల పట్టిపై లైంగిక దాడికి పాల్పడినట్లు, రెండు నెలలుగా ఇదే తరహాలో ఇబ్బంది పెడుతున్నట్లు తెలుసుకుంది. వెంటనే విషయాన్ని భర్తకు చెప్పింది. వెంటనే తమ స్నేహితులు, బంధువులతో కలిసి పాఠశాలకు వెళ్లిన తల్లిదండ్రులు.. అక్కడే ఉన్న డ్రైవర్‌ను నిలదీశారు. అతడు బుకాయించడంతో చితకబాదారు. ఒక దశలో పాఠశాల ప్రిన్సిపల్‌పైనా దాడి చేసేందుకు వెళ్లగా.. సిబ్బంది సర్ది చెప్పడంతో శాంతించారు.

Also Read: నిరుద్యోగులను ప్రధాని మోడీ మోసం చేశారు: రేవంత్‌రెడ్డి

సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకొని డ్రైవర్ రజనీకుమార్ సహా ప్రిన్సిపల్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే రజనీ కుమార్ నేర చరిత్ర గురించి పోలీసులు వివరాలు సేకరించారు. నిందితుడు మరికొంత మంది విద్యార్థినిలతోనూ అసభ్యంగా ప్రవర్తించినట్లు తేల్చారు. 11 ఏళ్లుగా పాఠశాల ఇంఛార్జ్ ప్రిన్సిపల్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తున్న రజనీ కుమార్.. ఇతర ఉపాధ్యాయుల వద్ద అజమాయిషీ ప్రదర్శించే వాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రిన్సిపల్ వద్ద ఉండే వ్యక్తి కావడంతో ఉపాధ్యాయులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించారని పోలీసులు తెలిపారు. దీనిని ఆసరాగా తీసుకొని చిన్నారుల తరగతి గదుల్లోకి వెళ్లడం.. డిజిటల్ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్లడం లాంటివి చేసేవాడని.. ఈ క్రమంలోనే చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యాశాఖ
డిఎవి పాఠశాల ఘటనపై తీవ్రంగా స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల గుర్తింపును రద్దు చేశారు. స్కూల్లో చదువుతున్న పిల్లలను ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేయాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 700 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని పిల్లల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయొద్దని.. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలని విద్యా శాఖ ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న విద్యా శాఖ.. ఈ విద్యా సంవత్సరం వరకు పాఠశాల గుర్తింపును కొనసాగించాలని నిర్ణయించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News