Monday, April 29, 2024

బలమైన “భవ్య భారత్ ”నిర్మాణానికి ఆలోచనల విస్తరణ అవసరం : ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మన ఆలోచనలు చిన్న కాన్వాస్ మాదిరి ఉంటే “భవ్యభారత్‌” చిత్రాన్ని భారీగా చిత్రీకరించలేమని అదే విధంగా సభ్యులు పెద్దగా ఆలోచించకుంటే గ్రాండ్ ఇండియా ఆలోచనను ఊహించలేరని, బలమైన భారత్ కోసం కాన్వాస్‌ను విస్తరించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రాధాన్యాల మేరకు పెరుగుతున్న ఆకాంక్షలకు తగ్గట్టు అన్ని సంస్కరణలను చేపట్టి, కొత్త చట్టాలను ముందుకు తీసుకెళ్లడం తప్పదని తెలియజేశారు. పాత పార్లమెంట్ భవనం లోని సెంట్రల్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను రూపొందించడానికి సభ్యులు నిబద్ధతను పునరుద్ఘాటించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పార్లమెంట్ భవనానికి తరలిరావడం నూతన భవిష్యత్ దిశగా ప్రారంభానికి సంకేతంగా అభివర్ణించారు. పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్ ప్రఖ్యాతిని ఉదహరిస్తూ 1952 వరకు ప్రపంచం మొత్తం మీద 41దేశాల ప్రతినిధులు పాత పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారని, గత ఏడు దశాబ్దాల్లో 4000 కు పైగా చట్టాలు ఆమోదం పొందాయని , ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనంతో కలిపి మనమంతా కొత్త భవిష్యత్తును ప్రారంభించబోతున్నామన్నారు. పార్లమెంట్ పాత భవనంలో ఆమోదం పొందిన బిల్లుల గురించి ప్రస్తావిస్తూ ట్రిపుల్ తలాక్ చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందిందని, దీని ద్వారా ముస్లిం తల్లులకు , సోదరీమణులకు న్యాయం చేకూరిందని ఉదహరించారు.

“గత కొద్ది సంవత్సరాల్లో ట్రాన్స్‌జెండర్లకు న్యాయం చేకూర్చే చట్టాలను , దివ్యాంగుల భవిష్యత్‌కు భరోసా ఇచ్చే చట్టాలను మనం సమష్టిగా ఆమోదించాం. ఆర్టికల్ 370ను రద్దు చేసే అవకాశం కలగడం మనకు విశేషం.” అని మోడీ గుర్తు చేశారు. ఆర్టికల్ 370 ని రద్దు చేసి, వేర్పాటు వాదం, ఉగ్రవాదంకు వ్యతిరేకంగా పోరాటం సాగించడంలో పార్లమెంట్ ముఖ్యమైన అడుగు వేసిందన్నారు. ఇక్కడి పార్లమెంట్ సభల్లో తయారైన రాజ్యాంగం జమ్ముకశ్మీర్ లో అమలైందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News