Tuesday, April 30, 2024

నెల రోజుల్లో కొత్త సచివాలయం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : మరో నెల రోజుల్లో కొత్త సచివాలయం భవన నిర్మాణం అందుబాటులోకి రానుంది. తొమ్మిది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ నిర్మాణం తుది మెరుగులు దిద్దుకుంటోంది. విశాలమైన కారిడార్లు, ధారాళంగా వెలుతురు, గాలి వచ్చేలా గ్రీన్ బిల్డింగ్స్ మార్గదర్శకాలకు లోబడి ఆధునిక భవంతిని నిర్మిస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుతో నూతన సచివాలయ భవన నిర్మాణం ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదినం రోజున ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది.

నిర్మాణ పనులు 2020 జనవరి 04న ప్రారంభం

కొత్త సచివాలయ నిర్మాణ పనులు 2020 జనవరి 04 తేదీన పనులు ప్రారంభం కాగా, రూ.617 కోట్ల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణ పనులను చేపట్టారు. సచివాలయం ప్రాంగణం మొత్తం విస్తీర్ణం 26.98 ఎకరాలు కాగా, వాస్తు దోషాలు పోనూ దీర్ఘ చతురస్రాకారంలో 20 ఎకరాల్లో ఈ కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపట్టారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు కొట్టి పడేలా దక్కన్, కాకతీయ శైలి ఉండేలా ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెకట్స్ భవన నమూనా సిద్ధం చేసింది.

భవనంపై మొత్తం 34 గుమ్మటాలు

భవనం లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విశాలమైన కారిడార్లతో నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఆరు అంతస్తుల్లో సచివాలయ ప్రధాన భవనాన్ని నిర్మించారు. దీని విస్తీర్ణం 7.88 లక్షల చదరపు అడుగులు కాగా మధ్యలో భవనం పైన ఐదు అంతస్థుల మేర భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్స్ నిర్మాణం జరుగుతోంది. అతిథుల కోసం నిర్మిస్తున్న ఈ పోర్టీకో టవర్స్ ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. భవనంపై మొత్తం 34 గుమ్మటాలు ఏర్పాటు చేయగా తూర్పు, పశ్చిమ వైపు భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేశారు. కాంస్యంతో 18 అడుగుల ఎత్తు, ఐదు టన్నుల బరువుతో జాతీయ చిహ్నాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. దీర్ఘ చతురస్రా ఆకారంలో ఉండే భవనం మధ్యలో విశాలమైన కోర్టు యార్డ్ వచ్చేలా నిర్మాణం చేశారు. మధ్యలో భారీ ఫౌంటేయిన్ రానుండగా ప్రధాన భవనం 2.45 ఎకరాల్లో, కోర్టు యార్డ్ 1.98 ఎకరాల్లో ఉంటుంది.

తుదిదశలో పోర్టికో పనులు

సచివాలయ ప్రధాన భవనం నిర్మాణ పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్ తదితర అంతర్గత పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన ప్రవేశద్వారం పనులతో పాటు పోర్టికో పనులు తుదిదశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరో అంతస్తు పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక లిఫ్టును ఏర్పాటుచేశారు. భద్రతాపరంగా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు.

1.21 ఎకరాల్లో పార్కింగ్ వసతి

ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, సందర్శకులు ఇలా వేర్వేరు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. భవనం నలువైపులా అన్ని రకాల వాహనాలు సులువుగా తిరిగిన విశాలమైన రహదారులు నిర్మించారు. భవనం వెలుపల హెలిప్యాడ్, విశాలమైన పచ్చిక బయళ్లు, ఫౌంటేయిన్లు రానున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు, సిబ్బంది వాహనాల కోసం లోపల 2.45 ఎకరాల్లో పార్కింగ్ వసతి ఏర్పాటు చేస్తున్నారు. 500కు పైగా కార్లు, 700కు పైగా ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులు, అంబులెన్స్‌కు అవకాశం ఉంటుంది. సందర్శకుల కోసం వెలుపల 1.21 ఎకరాల్లో పార్కింగ్ వసతి కల్పిస్తారు. సచివాలయ కాంప్లెక్స్ వెలుపల ఆలయం, మసీదు, చర్చి, కార్యాలయాల కాంప్లెక్స్ తదితరాలను 8 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సిద్ధం చేస్తున్నారు. సచివాలయ పనులన్నీ దాదాపుగా పూర్తి కావచ్చాయి. 90 శాతానికి పైగా పనులన్నీ పూర్తి కాగా మిగిలిన వాటిని యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News