ముంబై : ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్కే గెలుపు అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్లోని పరిస్థితులు భారత్తో పోల్చితే కివీస్కే చాలా అనుకూలంగా ఉంటాయమన్నాడు. న్యూజిలాండ్ మాదిరిగానే ఇంగ్లండ్ వాతావరణం ఉంటుందని, పిచ్లు కూడా ఫాస్ట్ బౌలింగ్కు సహకరిస్తాయని పేర్కొన్నాడు. ఇదే జరిగితే టిమ్ సౌథి, ట్రెంట్ బౌల్ట్, వాగ్నర్ వంటి అగ్రశ్రేణి బౌలర్లను ఎదుర్కొని భారీ స్కోర్లు సాధించడం టీమిండియాకు అంత తేలిక కాదన్నాడు. బ్యాటింగ్లో కివీస్ కంటే బలంగా ఉన్న భారత్ బౌలింగ్లో మాత్రం కాస్త బలహీనంగా కనిపిస్తుందన్నాడు.
ఇంగ్లండ్ పిచ్లను కివీస్ బౌలర్లు తమకు అనుకూలంగా మార్చుకోవడం ఖాయమన్నాడు. ఉప ఖండంతో పోల్చితే ఇంగ్లండ్ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉంటాయన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియాకు డబ్లూటిసి ఫైనల్లో గెలవడం కష్టంతో కూడుకున్న అంశమన్నాడు. విరాట్ కోహ్లి, రహానె, పుజారా, విహారి, రోహిత్ శర్మ, మయాంక్, రిషబ్ పంత్ వంటి స్టార్ బ్యాట్స్మెన్లు అందుబాటులో ఉన్నా కివీస్ బౌలర్లను ఎంత వరకు సమర్థంగా ఎదుర్కొంటారనేది సందేహమేనన్నాడు. ఎందుకంటే బౌన్స్కు సహకరించే పిచ్లపై కివీస్ బౌలర్లను ఎదుర్కొవడం ఎంతటి పెద్ద బ్యాట్స్మన్కైనా చాలా కష్టమని మంజ్రేకర్ పేర్కొన్నాడు.