Friday, May 3, 2024

బర్త్ సర్టిఫికెట్‌లో కుల, మత రహిత కాలమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌కు చెందిన సందేపాగు రూప, డేవిడ్ దంపతులు తమ కుమారుడు ఇవాన్ రూడేకి పుట్టుకతో కుల రహిత, మత రహిత సర్టిఫికేట్‌ను ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో 2019 ఆగస్టు 28న నమోదు చేసిన రిట్ పిటిషన్‌పై బుధవారం జస్టిస్ లలిత కన్నెగంటి కీలకమైన తీర్పును వెలువరించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని విశ్వసించే స్వేచ్చ ఉన్నట్లుగానే తమకు నమ్మకం లేని మతాన్ని విశ్వసించని హక్కు కూడా ఉంటుంది.

ఇది భావప్రకటన స్వేచ్ఛలో భాగం కాబట్టి పిటిషనర్లు కోరినట్లుగా ‘బర్త్ సర్టిఫికేట్’ లో కుల రహిత, మత రహిత’ కాలాన్ని పొందు పరచాలని, దీని కోసం చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. వివరాల్లోకి వెళితే 2019, మార్చి 23న జన్మించిన తమ కొడుకు ‘ఇవాన్ రూడే’ బర్త్ సర్టిఫికెట్ కోసం దంపతులు వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి వెళ్లారు (బాబూ జన్మించిన ప్రాంతం). జనన నమోదు ఫారం లోని కుటుంబ ‘మతం’ అనే కలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని సదరు అధికారులు చెప్పడంతో, కులాంతర, మతాంతర వివాహం చేసుకున్న వీళ్ళు మతాన్ని, కులాన్ని విశ్వసించడం లేదు కాబట్టి అందులో ఉన్న ‘కుటుంబ మతం’ అనే కాలామ్ నింపడానికి నిరాకరిం చారు.

ఆ కాలామ్ నింపితే తప్ప బర్త్ సర్టిఫికెట్ ఇవ్వడం కుదరదని మున్సిపాలిటీ అధికారులు చెప్పడంతో వాళ్ళు జిల్లా కలెక్టర్ మొదలు పై అధికారులను ఆశ్రయించారు. తాము కోరిన పద్ధతుల్లో బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో వాళ్ళు ఎట్టకేలకు హైకోర్టులో పిల్‌ను దాఖలు (2019, ఆగస్టు 28న) చేశారు. గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం వీళ్ళ డిమాండ్ పైన కౌం టర్ దాఖలు చేయమని కోరుతూ జనన మరణ ధ్రువీకరణ అధికారులకు (రిజిస్ట్రర్ ఆఫ్ సైన్సెస్), రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శికి,కొత్తకోట మున్సిపాలిటీ అధికారులకు నోటీసులు పంపింది.

తదుపరి విచారణను నాలుగు వారాల గడువు విధించింది. అయితే సంవత్సరాలు గడుస్తున్న ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయకపోగా, మరింత సమయాన్ని కోరుతూ వాయిదా వేస్తూ వచ్చారు. 5 సంవత్సరాల లోపు బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని ప్రభుత్వ నియమాలు ఉన్న నేపథ్యంలో, బర్త్ సర్టిఫికేట్ లేని కారణంగా ఆధార్ కార్టు ఇవ్వకపోవడం అలాగే స్కూల్లో చేర్చుకోవడానికి విద్యాసంస్థలు నిరాకరించడంతో అత్యవసరంగా తీర్పు ఇవ్వాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు ఎస్. వెంకన్న, డి. సురేష్ కుమార్ లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు ఎట్టకేలకు తీర్పువెలువరించింది.

తీర్పుపట్ల దంపతులు హర్షం….
తాము కోరినట్లుగా జస్టిస్ లలిత కన్నెగంటి తీర్పు ఇవ్వడం పట్ల డేవిడ్, రూప దంపతులు హర్షం వ్యక్తం చేశారు. మూడు సంవత్సరాల తమ పోరాటం ఫలించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఎంతో మందికి దారి చూపుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News