పెద్దలు టీకాలు వేయించుకుంటేనే పిల్లలకు రక్ష
న్యూఢిల్లీ : కరోనా రెండో ఉప్పెన ముగియక ముందే మూడో ఉప్పెన వస్తుందని, అది పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న నిపుణుల అభిప్రాయాలు తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే థర్డ్ వేవ్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం వెల్లడించింది. ఈమేరకు ప్రధాని కొవిడ్ నిర్వహణ బృందంలో ఒకరైన వికెపాల్ మీడియాతో మాట్లాడారు. మూడో దశ పిల్లలపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుందనడంపై స్సష్టత లేదు. ఇప్పటివరకు పెద్దల మాదిరి గానే పిల్లలు ప్రభావితం అయ్యారని ఆయన వెల్లడించారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ఆధారంగా సీరో ప్రెవెనల్న్స్ రేటు అదే విషయాన్ని వెల్లడి చేసిందన్నారు. అలాగే రానున్న దశలో వారికి అధికంగా ఈ వైరస్ సోకుతుందని రుజువు చేసే ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా మీడియాకు వెల్లడించారు.
మరోపక్క కరోనా టీకాపై ఉన్న అనుమానాలను తొలగించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చిన్నారులను రక్షించుకోడానికి తలిదండ్రులు టీకా వేయించుకోవాలని కోరుతోంది. పెద్దలు టీకాలు వేసుకుంటే పిల్లలకు వైరస్ సోకే అవకాశం చాలావరకు తగ్గిపోతుందని వీకె పాల్ చెప్పారు. ఇండియన్ పీడియాట్రెక్స్ అసోసియేషన్ కూడా తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేయొద్దని కోరింది. తదుపరి దళలో పసిపిల్లల్లో తీవ్ర లక్షణాలు ఉండొచ్చునే వాదనను నిపుణులు తోసిపుచ్చారు. రెండు దశల్లో సేకరించిన వివరాల ప్రకారం కొద్దిశాతం మందికి మాత్రమే తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.