* కరోనా నేపథ్యంలో నిర్ణయం
* నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
హైదరాబాద్: నగరంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరోనా వైరస్ వ్యాపిస్తుండడంతో ప్రజలు గుంపులుగా ఒక ప్రాంతంలో చేరడం నిషేధమని అన్నారు. కొత్త ఏడాదికి నిర్వహించే అన్ని రకాల వేడకలపై నిషేధం విధించినట్లు తెలిపారు. న్యూఇయర్కు ఎలాంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. క్లబ్బులు, పబ్బులు, స్టార్ హోటళ్లు, రిసార్ట్, ఫాంహౌస్లలో ఎలాంటి వేడుకలు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. ఈ నిబంధనలు ఫంక్షన్ హాళ్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు.
ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశామని, వారు స్థానిక నిర్వహకులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకున్నారని అన్నారు. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి ఎవరూ వాహనాలు నడపవద్దని కోరారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలోని వారు కూడా ఒక ప్రాంతానికి చేరుకుని వేడుకలు చేసుకోవడం నిషేధం అని అన్నారు. కరోనా వ్యాపించకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సహకరించాలని కోరారు.