హైదరాబాద్ : కరోనా(కొవిడ్19) ప్రభావంతో ప్రభుత్వ కార్యాలయాల్లో సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. కేవలం సిబ్బందికి మాత్రమే అనుమతిస్తూ కార్యాకలాపాలు సాగిస్తున్నారు. వైరస్ నియంత్రణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ప్రధాన కార్యాలయాల్లో ‘నో విజిటర్స్’ బోర్డులు కనిపిస్తున్నాయి. ఒక్కరిని కూడా కార్యాలయాల్లోకి అనుమతించడం లేదు. ఒకవేళ అత్యవసరమైతే సదరు వ్యక్తులకు శానిటైజర్స్ ఇచ్చి చేతులు పరిశుభ్రమైన తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. దీంతో పాటు సిబ్బంది కూడా కార్యాలయాల్లోకి వెళ్లేటపుడు, బయటకు వచ్చేటపుడు చేతులను శుభ్రంగా ఉంచేందుకు అన్ని కార్యాలయాల ప్రధాన గేట్ల వద్ద ప్రభుత్వం శానిటైజర్లను అందుబాటులో ఉంచింది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలకు ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.