Monday, April 29, 2024

అటకెక్కిన విభజన సమస్యలు

- Advertisement -
- Advertisement -

తెలుగు రాష్ట్రాల సమస్యలకు 9ఏళ్లు

తెలంగాణ సమస్యలపై అంతులేని నిర్లక్ష్యం

కాలయాపనతో తెలంగాణకు భారీనష్టం
విభజన వివాదాలపై చిత్తశుద్ధిలేని కేంద్రం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించకుండా కేం ద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అటకెక్కించిందనే విమర్శలు తారాస్థాయిలో ఉన్నాయి. రమారమి తొమ్మిది సంవత్సరాలకు పైగా కాలయాపన చేసిన కేంద్ర ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతుందనే వార్తల నేపధ్యంలో విభజన సమస్యలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు బిజెపి ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. అత్యంత కీలకమైన విభజన సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికలకు వెళితే తప్పకుండా తెలంగాణ ప్రజలు బిజెపికి తగిన గుణపాఠం చెప్పే అవకాశాలున్నాయని అ ధికారవర్గాలంటున్నాయి.

తెలుగు రాష్ట్రాలు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్లలో ఎవ్వరి వాదనల్లో న్యాయం ఉంది, ఏ రాష్ట్రం వారు న్యాయానికి, ధర్మానికి విరుద్ధంగా వాదనలను వినిపిస్తున్నారనే అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వశాఖలోని ఏ ఒక్క అధికారికి కూడా స్పష్టత లేకపోవడం, కొద్దిగా అవగాహన వచ్చిన ఉన్నతాధికారులను బదిలీలు చేయడం, కొత్త వారు వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలను పరిష్కరించేందుకు పూనుకునే సరికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుండటం వంటి ఆచరణాత్మకమైన సమస్యలతో అంతులేని జాప్యం జరుగుతూ వచ్చిందనే విమర్శలున్నాయి. అయితే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్‌కుమార్ భల్లాకు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై ఒక అవగాహన వచ్చిందని, కానీ గడచిన ఏడాది కాలంగా ఆయన కూడా విభజన సమస్యల పరిష్కారానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తెలుగు రాష్ట్రాల అధికారవర్గాలు తీవ్ర అసహనాన్ని వ్యక్తంచేస్తున్నాయి. అత్యంత కీలకమైన 9వ షెడ్యూలులోని 91 సంస్థల విభజన విషయంలో డాక్టర్ షీలాభిడే నేతృత్వంలోని నిపుణుల కమిటీ సిఫారసులను కూడా అమలు చేయించడంలో కేంద్రం వైఫల్యం చెందిందని, వివాదాల పరిష్కారానికి నియమించిన సబ్-కమిటీ మూడు దశల్లో ఈ సంస్థలను విభజించాలని సిఫారసు చేసిందని, అందులో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అంశాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఏపీ ప్రభుత్వం మాత్రం షీలాభిడే సిఫారసులను యధావిధిగా ఆమోదించిందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే అం శాలన్నీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ఆ కేసులు తేలాల్సి ఉందని సాకును చూపించి వాయిదా వేస్తూ వచ్చారని వివరించారు. అంతేగాక డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (డి.ఐ.ఎల్.ఎల్-దిల్), ఏపీ డైరీ డవలప్‌మెంట్ కార్పోరేషన్‌ల వివాదాల పరిష్కారంపై తెలంగాణ ఇచ్చిన విన్నపాలను గత సమావేశంలో కేంద్ర న్యాయశాఖ పరిశీలనకు పంపించారని, ఆ సమస్యను పరిష్కరిస్తూ హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తగిన నిర్ణయం తీసుకొంటారని భావించినప్పటికీ ఎలాం టి ప్రయోజనం లేకుండా పోయిందని వివరించారు. అదే విధంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ వివాదంపైన కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. ఇక అత్యంత కీలకమైన 10వ షెడ్యూలులోని 142 ఇన్‌స్టిట్యూషన్ల విషయంలో కూడా ఎలాంటి ముందడుగు పడలేదని, తెలుగు అకాడెమీ విషయంలో కోర్టులో కేసులు నడుస్తున్నాయని, ఈ సంస్థల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను భంగం కలిగించేవిగా ఉన్నాయని, తెలంగాణకు న్యాయం జరుగుతుందా? అనేది జవాబు దొరకని ప్రశ్నగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు.

ఇక సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్.సి.సి.ఎల్), ఏపీ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ (ఏ.పీ.హెచ్.ఎం.ఇ.ఎల్)లు పూర్తి గా తెలంగాణకు చెందిన ఆస్తులని, ఇందులో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి సంబంధంలేదని, ఏ.పీ.హెచ్.ఎం.ఇ.ఎల్ సంస్థ కేవలం సింగరేణికి అనుబంధ సంస్థ మాత్రమేనని, అందుకే సింగరేణిలో వాటాలు కోరుతున్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ పూర్తిగా వ్యతిరేకిస్తోందని, ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి భల్లా అధ్యక్షతన జరిగిన సమావేశాల్లో కూడా చాలా స్పష్టంగా, మరింత కఠినంగా తెగేసి చెప్పామని వివరించారు. సింగరేణి కాలరీస్‌ను కాపాడుకోవడానికి ఎంతదాకైనా వెళతామని, ఇందులో రాజీపడే ప్రసక్తేలేదని, వీసమెత్తు అయినా సింగరేణి గనుల్లో ఏపీకి వాటాలు ఇచ్చే ప్రసక్తేలేదని వివరించారు. ఇక సివిల్ సప్లయీస్ కార్పోరేషన్‌కు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చిన నిధుల్లో వివాదాస్పదమైన 354 కోట్ల రూపాయల సబ్సిడీలో తెలంగాణ రాష్ట్ర వాటా తేలే వరకూ ఆ నిధులను విడుదల చేసేదిలేదని ఆ అధికారులు పునరుద్ఘాటించారు. అంతేగాక విభజన చట్టంలో ప్రస్తావన లేనటువంటి 12 ఇన్‌స్టిట్యూట్‌లను విభజించడానికి ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు తాము గండికొట్టామని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్న ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను ఇప్పటి వరకూ అడ్డుకున్నామని, కానీ ఎన్నికల మూడ్‌లోకి కేంద్ర ప్రభు త్వం వెళుతోందని, అదే జరిగితే మరో ఏడాది వరకూ ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు లేవని, అప్ప టి వరకూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగకుండా కాపాడుకోవడం చాలా కష్టమేనని ఆ అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు, బ్యాంక్ బ్యాలెన్స్‌లపైన కూడా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సిఎజి-కాగ్) సలహాలు తీసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు గత సమావేశాల్లోనే అంగీకారం తెలిపాయని, మళ్ళీ తాము అదే విషయానికి కట్టుబడి ఉంటామని, కానీ ఏపీ ప్రభుత్వం కాగ్ సూచనలను గౌరవిస్తుందా? లేదా? అనేది అనుమానాస్పదమేనని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను విడుదల చేయించాలని కేంద్రప్రభుత్వాన్ని అనేకసార్లు కోరామని, అందుకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా గత సమావేశాల్లోనే ఆర్ధికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారని, కానీ ఇప్పటి వరకూ కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పా టు చేయాలని విభజన చట్టంలోనే ఉన్న అంశాన్ని ఎన్నోసార్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ కార్యదర్శికి గుర్తు చేశామని చెప్పారు. కానీ ఇప్పటి వరకూ ఈ అంశంపై ఉలు కూ పలుకూ లేదని వివరించారు.

రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉన్న అంశాన్ని కూడా గుర్తు చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వమే తాను రూపొందించిన చట్టాన్ని తానే తుంగలోతొక్కుతోందని, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని రూపొందించిన కేంద్రం ఆ చట్టాన్ని గౌరవించడం లేదని చెబుతూ నిరసన వ్యక్తంచేశామని ఆ అధికారులు వివరించారు. విభజన చట్టంలోని సెక్షన్ 50, 51, 56లను సవరణలను చేయాలనే ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూవచ్చామని, రాష్ట్రాల విభజన జరిగిన తొమ్మిదేళ్ళ త ర్వాత చట్టంలో సవరణలు చేయడం అర్ధరహితమని, ఇలా చేస్తే ఆ చట్టానికి హేతుబద్దత ఉండదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ తీరు ఇలా ఉంది గనుకనే హోంమంత్రిత్వశాఖ చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తోందని వ్యాఖ్యానించా రు. అసలే రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో ఈ సమస్యలన్నింటినీ కేంద్రం అటకెక్కించినట్లుగానే భావించాల్సి వస్తోందని, ఇన్ని సమస్యలను పరిష్కరించకుండా కేం ద్రంలోని బిజెపి ఎన్నికలకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో తప్పకుండా విభజన సమస్యలన్నీ మళ్ళీ తెరపైకి వస్తాయని అంచనా వేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News