సెకండ్ వేవ్తో 97% తగ్గిన కుటుంబాల ఆదాయం: నివేదిక
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో కోటి మందికి పైగా భారతీయులు ఉద్యోగాలు కోల్పోగా, 97 శాతానికి పైగా కుటుంబాల ఆదాయం తగ్గింది. సిఎంఐఇ (సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ) సిఇఒ మహేష్ వ్యాస్ నివేదికలో ఈ విషయం చెప్పారు. మే నెల చివరి నాటికి దేశంలోని నిరుద్యోగం రేటు 12 శాతానికి రానుందని ఆయన చెప్పారు. 2020లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు విధించడంతో మేలో నిరుద్యోగం రేటు 23.5 శాతానికి చేరుకుంది. కరోనా సెకండ్ వేవ్ భారీ ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రాష్ట్రాలు నెమ్మదిగా ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలను ఎత్తివేయడంతో ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని అంటున్నారు.
కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన వారికి మళ్ళీ ఉపాధి అంత త్వరగా లభించదు. అసంఘటిత రంగంలో త్వరలో ఉద్యోగాలు లభించినప్పటికీ వ్యవస్థీకృత రంగంలో నాణ్యమైన ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ఏడాది సమయం పడుతుంది.