హైదరాబాద్: ధరలు ఒక్కసారిగా పెరిగి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గడగడలాడించి వినియోగదారుల కంట కన్నీరు తెప్పించినా…. ధరలు ఒక్కసారి పడిపోయి వాటిని పండించిన రైతులకు కన్నీరు తెప్పించినా అది కేవలం ఉల్లికి మాత్రమే సాధ్యం. రెండు సంవత్సరాల క్రితం ఉల్లిగడ్డలు కొనుగోలు చేయాలంటే మార్కెటల్లో క్యూలో నిలబడి, ఆధార్కార్డు చూపించి కొనుగోలు చేయాల్సి వచ్చింది. అది కూడా కుటుంబానికి కెజి మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్లో ఉల్లి ధరలు చూస్తే అదే పరిస్థితి వస్తుందని వినియోగదారులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలో సైతం కిలో రూ.15 నుంచి 20 పలికిన ఉల్లి ప్రస్తుతం కిలో రూ.40 నుంచి 50 పలుకుతు వినియోగదారులను బయపెడుతోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా వర్షాలు కురడంతో ఉల్లిని ప్రధాన పండించే ప్రాంతాలైన మహరాష్ట్ర, కర్నాటక తదిత ప్రాంతాల్లో గత 30 సంవత్సరాల్లో ఎప్పుడను కురవని విధంగా వర్షాలు పడటంతో ఆయా ప్రాంతాల్లో చేతికి వచ్చిన పంటను నీటి పాలు కావడం, రోడ్లన్ని ఎక్కడికక్కడే తెగిపోవడంతో రవాణాకు అంతరాయం కలిగిందని అధికారులు చెబుతున్నారు.
నగరానికి, మహరాష్ట్ర, కర్నాటకు నుంచి రోజుకు 5 నుంచి 10 వేల బస్తాల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. ఇక తెలుగురాష్ట్రాల నుంచి అంటే కర్నూల్, మహబూబ్నగర్, తదితర ప్రాంతాల నుంచి 5 వేల బస్తాలు తరలివస్తున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలతో పాటు, పొరుగున ఉన్న ఎపి నుంచి కూడా వచ్చే దిగుమతులు తగ్గిపోయాయని చెబుతున్నారు. ప్రధానంగా నగరానికి ఉల్లిసరఫరా చేసే రంగారెడ్డి, వికారాబాద్, పరిగి తదితర ప్రాంతాల్లో వానలు పడటంతో ఇటువంటి పరిస్థితి వచ్చిందని, కొద్ది రోజుల్లో ఇటువంటి పరిస్థితి నుంచి బయట పడతామని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కోల్డ్ స్టోరేజ్లు లేక పోవడం కారణం
ప్రస్తుత పరిస్థితికి నగరంలో రైతుబజార్లు, మార్కెట్ యార్డులలో సరైన కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం లేక పోవడమే కారణమని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నగర వాసుల నుంచి రైతు బజార్లకు మంచి ఆదరరణ ఉన్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా అభివృద్ది పనులు చేపట్టాల్సిన అధికారులు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. కూరగాయలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన కోల్డ్స్టోరేజ్ ఒకటి రెండు రైతుబజార్లలో మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు.
రోజంతా రైతులు విక్రయించగా మిగిలిన కూరగాయలను భద్రపర్చుకునేందుకు ప్రతి రైతు బజార్లో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రకటించిందే తడువుగా రెండు చోట్ల మాత్రమే వాటిని ఏర్పాటు చేసి మిగిల వాటి ఏర్పాటు చేయడంలో నిర్లక్షం ప్రదర్శిస్తున్నారు. గ్రామాల నుంచి వస్తున్న రైతులు మిగిలిన కూరగయాలను భద్రపర్చుకునే అవకాశం లేదు. వృథా పారబోయడం తప్ప వాటిని కోల్ స్టోరేజ్లలో భద్ర పరచి మరుసటి రోజు అమ్ముకునే అవకాశం లేదు. కోల్డ్స్టోరేజ్లు ఎంతో అవసరరం అని రైతులు చెబుతున్న అధికారులు వాటి ఏర్పాటు దిశగా ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.