ప్రసవానికి వచ్చిన మహిళకు బదులు ఏడు నెలల మరో గర్భిణికి ఆపరేషన్ చేసిన గాంధీ ఆసుపత్రి వైద్యులు
బిడ్డ మృతి, ప్రాణాపాయ స్థితిలో తల్లి
ప్లేట్లెట్లు తగ్గడంతో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళకు ఎదురైన దుస్థితి
పోలీసులకు ఫిర్యాదు, కేసు నమోదు
నర్సుదే పొరపాటా?
మన తెలంగాణ / సికింద్రాబాద్ : గాంధీ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకు ంది. ప్రసవం కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ భవానికి చేయాల్సిన ఆపరేషన్ పొరపాటున మరో గర్భిణీ సమతకు చేయడంతో పుట్టిన బిడ్డ మృతి చెందింది. తీవ్ర రక్త స్రావం కావడంతో సమత ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది. విషయం తెలుసుకున్న సమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ జరిగిన సమతకు ఆడపిల్ల పుట్టినట్టు ట్యాగ్ వేసి చనిపోయిన తరువాత మగ శిశువును ఇచ్చినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ్ల మహబూబాబాద్ జిల్లా వడ్డే కొత్తపల్లి, పెద్దవంగర గ్రామానికి చెందిన సమత ఈ నెల 11న రక్తంలో ప్లేట్లెట్స్ ( రక్తకణాల క్షీణత) తగ్గుతుండటంతో గాంధీ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చింది.
ఈ క్రమంలో ఈనెల 12న అదే వార్డులో ఉండే తొమ్మిది నెలల గర్భిణీ భవానికి ఆపరేషన్ చేయాల్సి ఉండగా, ఏడు నెలల గర్భిణీ ఆయిన సమతకు పొరపాటున ఆపరేషన్ చేశారు. దీంతో పుట్టిన బిడ్డ మృతి చెందగా, సమత తీవ్ర రక్తస్రావమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. విషయం తెలుసుకున్న సమంత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విధుల్లో ఉన్న నర్సు కారణంగానే ఈ తప్పిదం జరిగిందని వైద్యులు తెలిపారు. మృతి చెందిన మగ శిశువును తమకు అప్పగించారని, అయితే రిపోర్టుల్లో మాత్రం ఆడశిశువుగా ట్యాగ్ ఉందని బాధిత సమత కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.