నవంబర్ నుంచి కొత్త విధానాన్ని అమలు చేయనున్న ఆయిల్ కంపెనీలు
ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో అమలు
మనతెలంగాణ/హైదరాబాద్ : వంటగ్యాస్ ఇంటింటి సరఫరా చేసేందుకు ఓటిపి లేదా ఒకసారి వినియోగించే పాస్వర్డ్ను తప్పనిసరిగా చెప్పాలని ఆయిల్ కంపెనీలు కొత్త వ్యవస్థను నవంబర్ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నాయి. ఈ విధానం కోసం ఆయిల్ కంపెనీలు డెలివరీ ప్రామాణిక కోడ్ (డిఏసి)ని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. గ్యాస్ సిలిండర్ల చోరీ, వాటిని పక్కదారి పట్టించడం, నిజమైన లబ్ధిదారుడిగాక మరొకరికి సిలిండర్ను సరఫరా చేయడం వంటి వాటిని నియత్రించడం కోసం ఆయిల్ కంపెనీలు ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నాయి. ముందుగా 100 స్మార్ట్ నగరాల్లో దీనిని అమలు చేయనున్నారు. ఇప్పటికే రాజస్థాన్లోని జైపూర్లో ఇప్పటికే దీనిని ఫైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఒక వ్యక్తి గ్యాస్ సిలిండర్లను బుక్ చేయగా వారి రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్కు ఒక కోడ్ వస్తుంది. గ్యాస్ సిలిండర్ డెలివరీ సందర్భంగా సిబ్బందికి ఆ కోడ్ను చూపించాల్సి ఉంటుంది. దీని కోసం మొబైల్నెంబర్, అడ్రస్ను సంబంధిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే సంస్థ ద్వారా అప్డేట్ చేసుకోవాలి. వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు ఈ కొత్త విధానం వర్తించదని ఆయిల్ కంపెనీలు పేర్కొన్నాయి.