Saturday, April 27, 2024

ఆరు ప్రాజెక్టులకు అనుమతులివ్వండి

- Advertisement -
- Advertisement -

Pankaj Kumar Video Conference with CS Somesh kumar

గోదావరిపై తలపెట్టిన ఆ ప్రాజెక్టుల డిపిఆర్‌లు ఇప్పటికే
సమర్పించాం కృష్ణ, గోదావరి జలాల్లో న్యాయబద్ధంగా
రావాల్సిన వాటా కేటాయింపులకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు
చేయాలి కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్
కుమార్‌తో వీడియోకాన్ఫరెన్స్‌లో సిఎస్ సోమేశ్ కుమార్

మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి నదిపైనిర్మించిన ఆరు ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కృష్ణా, గోదావరి నదీజలాల్లో న్యాయ బద్ధంగా రావాల్సిన నీటి వాటాను కేటాయించేందకు కొత్తగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరింది. కృష్ణా, గోదావరీ నదీ యాజమాన్య బోర్డు లకు సంబంధించి ఈ ఏడాది జులై 15న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని వివిధ అంశాల అమలుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, 1956 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడానికి సుప్రీంకోర్టు లో దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని కోరారు.

ఇందుకనుగుణంగా, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు నుండి తన కేసును ఉపసంహరించుకున్నందున, ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న తెలంగాణ పభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేంద్ర కార్యదర్శిని కోరారు. అయితే ఈ అంశానికి సంబంధించి భారత ప్రభుత్వ న్యాయ శాఖ అభిప్రాయానికి పంపామని, న్యాయశాఖ నుంచి అభిప్రాయం అందిన వెంటనే ఈ అంశాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయనున్నట్టు కేంద్ర కార్యదర్శి స్పష్టం చేశారు.గోదావరి నదిపై సీతా రామ ఎల్‌ఐఎస్, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ (తుపాకులగూడెం ప్రాజెక్ట్), ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎల్‌ఐఎస్, చౌట్‌పల్లి హనుమంతరెడ్డి ఎల్‌ఐఎస్, మోడికుంటవాగు ప్రాజెక్టు, చనాక- కొరాట బ్యారేజీకి సంబంధించిన ఆరు సవివర ప్రాజెక్టు నివేదికలను (డిపిఆర్) అనుమతులకై ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే తెలంగాణ ప్రభుత్వం సమర్పించిందని, ఇవి ఇంకా కేంద్ర జల సంఘం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని చీఫ్ సెక్రటరీ ప్రస్తావించారు.

ఈ ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే అనుమతి ఇస్తామని జలశక్తి కార్యదర్శి హామీ ఇచ్చారు. గోదావరి బేసిన్‌లోని మరో ఐదు ప్రాజెక్టులు – రామప్ప-పాకాల లింక్ ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ (రోజుకు అదనంగా ఒక టిఎంసి), కందకుర్తి లిఫ్ట్ స్కీమ్, గూడెం ఎత్తిపోతల పథకం, పి.వి నర్సింహారావు కంతనపల్లి బ్యారేజీ ప్రాజెక్టులను, అనామోదిత ప్రాజెక్టుల జాబితాలో తప్పుగా చేర్చడం జరిగిందని, గోదావరీ నదీ యాజమాన్య బోర్డు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ నుండి ఈ ఐదు ప్రాజెక్టులను అనామోదిత ప్రాజెక్ట్‌ల జాబితా నుండి తొలగించాలని సోమేశ్ కుమార్ కేంద్ర కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. గోదావరి నదిపై నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్య పెద్దగా సమస్యలు, ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున, ప్రత్యేకంగా గోదావరి రివర్ మేనేజింగ్ బోర్డు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభిప్రాయపడ్డారు.

కృష్ణా నదిపై ఆంధ్రప్రదేశ్ చేపట్టిన అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులపై తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని కేంద్ర జల్ శక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ హామీ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ, జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ, తెలంగాణా నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇరిగేషన్ (జనరల్) ఈ.ఎన్.సి సి. మురళీధర్,గజ్వేల్ ఈ.ఎన్.సి హరిరామ్, ముఖ్యమంత్రి కాయలయం ఓ.ఎస్.డి. శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News