Tuesday, April 30, 2024

మసకబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం

- Advertisement -
- Advertisement -

మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రత వలయానికి బీటలు పడ్డాయి. ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ, మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించడం విస్మయాన్ని కలిగించింది. ఆ ఆగంతకుల ఉద్దేశం ఏమైనప్పటికీ పార్లమెంటు సభ్యులకు, మంత్రులకు, సభాపతికి రక్షణ కల్పించడంలో భద్రత వైఫల్యం అనేది మరోసారి కొట్టొచ్చినట్లు కనపడింది.ఈ దుండగులు సభలోకి అధికారికంగా బిజెపి ఎంపి నుండి పాసులు సంపాదించి సజావుగా ప్రవేశించి విజిటర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకి ఒక బెంచీ నుండి మరో బెంచీ పైకి లంఘించి గెంతుతూ పసుపు రంగు క్యాన్లతో పొగబెట్టి అధికార, ప్రతిపక్ష ఎంపిలను గడగడలాడించి వీరంగం వేయడాన్ని మీడియాలో చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో పార్లమెంటు లోపలి మార్షల్స్, ఇతర రక్షణ సిబ్బంది ఏమైనరో తెలియదు. పార్లమెంట్ సభ్యులలో అధికభాగం 6౦ ఏళ్ళు పైబడిన వృద్ధులే. చివరకు వారే ఆపసోపాలుపడి ఎలాగోలాగా ఆ దుండగులను పట్టుకున్నారు.

ఇంత పెద్ద దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాని, హోం శాఖ మంత్రి అమిత్ షా కాని, పార్లమెంటు వెలుపల టివి ఛానల్‌లో యథాలాపంగా మాట్లాడారు తప్పితే సభా వేదికపై నోరు విప్పకపోవడం ఏమిటి? అన్నది ఇక్కడో పెద్ద ప్రశ్న. పైగా ఈ సంఘటన పెద్ద విషయం కాదన్నట్టుగా బిజెపి నేతలు ప్రకటనలు చేయడం మరీ విచిత్రం. రంగు క్యాన్లకు బదులుగా ఆ దుండగులు ప్రాణాంతక విషవాయువులను వెదజల్లి వుంటే, మారణాయుధాలు తెచ్చి వుంటే మొత్తం పార్లమెంటు సభ్యుల, మంత్రుల ప్రాణాలకు ఎంత ముప్పు దాపురించేది? ఇంత సీరియస్ విషయంలో కూడా బాధ్యత గల దేశ ప్రధాని, హోం మంత్రి సభలో నిజానిజాలను ప్రకటించి చర్చను చేపట్టి ఉంటే బాగుండేది.ప్రతిపక్షాల ఆందోళనపై ప్రధాన మంత్రి మోడీ చాలా ఆలస్యంగా స్పందిస్తూ ఈ సంఘటన తీవ్రమైన ఉల్లంఘనే అని అంగీకరిస్తూనే ఈ విషయంలో ప్రతిపక్షాల ఆందోళన అనవసర రాద్ధాంతం అని ఈసడించడం విపక్షాలపై విమర్శలతో ఎదురు దాడికి దిగడం చిత్రంగా వుంది. ఈ అంశంపై ప్రభుత్వం సభలో ప్రకటన చేయాల్సిందిగా విపక్షాలు పట్టుపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటున్నది. దాంతో విపక్షాలు సభలో ఆందోళనకు దిగుతున్నాయి.

దీని వల్ల పార్లమెంటులో నిత్యం గలాభా జరిగి సభా కార్యక్రమాలకు ప్రతిష్టంభన ఏర్పడుతున్నది. వాయిదాలు మీద వాయిదాలతో విలువైన సభా సమయం వృథా అవుతున్నది. పార్లమెంటు ఉభయ సభల నుంచి విపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం రివాజైపోయింది. ఇప్పటి వరకు ఉభయ సభల్లో ఈ అంశంపై సస్పెండె అయిన సభ్యుల సంఖ్య 141 చేరుకొని రికార్డును సృష్టించడం ఆందోళన కలిగిస్తున్నది.ఇంత వరకు కేంద్ర ప్రభుత్వం గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలక విషయాల్లో ముఖ్యమైనవి రైతు సమస్యలు, కశ్మీర్ సమస్య, మణిపూర్ సమస్య రాజ్యాంగ చట్ట సంస్కరణలు, ఏదైనా సరే పార్లమెంటులో చర్చలు జరపకుండానే బిల్లులు పాస్ చేసుకుంటూ తనకున్న సంపూర్ణ మెజార్టీతో, నిరంకుశ పోకడలతో ప్రజాస్వామ్య విలువలను హత్య చేస్తున్నదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా విపక్షాలు క్రమశిక్షణ రాహిత్యంతో వ్యవహరిస్తున్నాయని కేంద్ర మంత్రులు ప్రతి విమర్శ చేస్తున్నారు. అసలు ఆ దుండగులకు పాసులు ఇచ్చిన బిజెపి ఎంపిని ఇంత వరకు పోలీసులు అరెస్టు చేయనే లేదు.

ఆ బిజెపి ఎంపి స్థానంలో కాంగ్రెస్ ఎంపి గాని, మరో విపక్ష పార్టీ ఎంపి గాని పాసులు ఇచ్చి వుంటే గనుక ఈపాటికి పార్లమెంట్‌లో భూకంపం వచ్చి దుమ్ము రేగేది. ప్రధాని, హోం మంత్రి వీరావేశంతో తమదైన హావభావ విన్యాసాలతో చెలరేగిపోయేవారు. ‘వీరంతా దేశద్రోహులు’, ‘ప్రజాస్వామ్య హంతకులు’, ‘అర్బన్ నక్సలైట్లు’, ‘పాకిస్తాన్, ఆల్‌ఖైదా లేదా ఖలిస్థాన్ తీవ్రవాద ఏజెంట్లు అంటూ గంటల తరబడి ఉపన్యాసాలు దంచేవారు. వారి పార్టీ శ్రేణులు, ఇతర ఉపశాఖల వందిమాగాధులు నిరసన ర్యాలీలు, రాస్తారోకోలు చేసి బీభత్సం సృష్టించే వారు. వారి మీడియా సంస్థలు 24 గంటలు ‘పీకలు తెగిన మేకల్లా’ టివి చర్చల్లో అరచి, ఘీపెట్టి ఉండేవారు. దేశభక్తి గురించి శ్రోతల చెవులు చిల్లులు పడేట్లు మొత్తుకొని నానాయాగీ చేసేవారు. ఇక వారి సంస్థాగత సోషల్ (పేయిడ్) మీడియా గ్రూపులవారి మాటలకు హద్దు అదుపు ఉండేది కాదు. దేశం అంతా రచ్చరచ్చ జరిగుండేది.
ఏదిఏమైనా పార్లమెంట్‌లో ఆగంతుకులు జరిపిన దాడిని నివారించడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పార్లమెంటులో ఎంపిలు మాట్లాడే స్వేచ్ఛను పూర్తిగా కోల్పోయారు. ఈ విధమైన విషమ పరిస్ధితులు దాపురించడం ప్రజాస్వామ్యానికి, దేశ ప్రతిష్ఠకు ఎంతమాత్రం క్షేమకరం కాదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News